ములుగు జిల్లాను ఏర్పాటు చేయాల్సిందే: కోదండరాం
జయశంకర్ భూపాపల్లి: ములుగు జిల్లా ఏర్పాటుతోనే ఏజెన్సీ ఆదివాసీల అస్తిత్వానికి రక్షణ కలుగుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. అపారమైన ఖనిజ సంపద, సహజ వనరులు, పర్యాటక, చారిత్రక నేపధ్యం ఉన్న ములుగు అందమైన ప్రదేశమని, జిల్లాగా ఏర్పడితే అనతికాలంలోనే అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ములుగులో ఏర్పాటుచేసిన జిల్లా ఆత్మగౌరవ సభకు కోదండరాంతోపాటు తెలంగాణ టిడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క, ప్రజాగాయకురాలు విమలక్క, బీజేపీ నేత వేణుగోపాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు. జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు గోసెందుకు మిగిల్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో 10 జిల్లాల నుంచి పెంచాలనుకున్నప్పుడు పదకొండో జిల్లాగా ములుగునే ఏర్పాటుచేయాల్సి ఉండేదని పేర్కొన్నారు. ఫైనల్ గెజిట్ ఇంకా రూపొందలేదు కాబట్టి ఇదే పోరాట పటిమను ప్రదర్శించి ములుగును జిల్లాగా సాధించుకోవాలని, ప్రతీ అడుగులోనూ సహకారం ఉంటుందని ఉద్యమాకరులకు మనోధైర్యాన్ని నూరిపోశారు. ములుగును జిల్లాగా సాధించుకోవాలన్న ప్రజల ఆకాంక్ష తప్పక నెరవేరుతుందని కోదండరాం అన్నారు.
వరంగల్, భద్రాద్రి జిల్లాల మధ్యలోని ములుగును జిల్లాగా చేయాల్సి ఉందని అన్నారు. పరిపాలనా యంత్రాంగం భాగస్వామ్యం లేకనే ప్రాంతం వెనుకబాటుకు గురైందని పేర్కొన్నారు. అందుకే ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
సభలు, దీక్షలకే పరిమితం కాకుండా ఏయే మండలాలు, గ్రామాలు ములుగు జిల్లాను కోరుకుంటున్నాయో తెలుసుకొని తీర్మానాలు చేయించాలని, ఇందు కోసం ఉద్యమాన్ని ఊరూరా విస్తరించాలని జేఏసీ నాయకులకు సూచించారు. ములుగు ప్రాంతంలోని వేలాది మందికి కల్పించి నేడు మూతపడ్డ బిల్ట్ కార్మాగారాన్ని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేసిన కోదండరాం కార్మికులకు 18 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలన్నారు. సమిష్టి పోరాటంలో సాధ్యకానిది ఏది లేదని, జిల్లా ఏర్పాటు బిల్ట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని అన్నారు.