hyd కేంద్రంగా ముంబై డ్రగ్స్ మాఫియా: ఎండీఎంఏ డ్రగ్స్ తయారీ; గోవాలో పెడ్లర్ అరెస్ట్ తో షాకింగ్ విషయాలు
గోవా డ్రగ్స్ రాకెట్ తీగ లాగితే హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న దందా గుట్టు బయట పడింది. గోవాలో డ్రగ్స్ రాకెట్ లో హైదరాబాద్ కు చెందిన డ్రగ్స్ పెడ్లర్ పట్టుబడడంతో హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ సంచలనంగా మారింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారం రోజులుగా గోవాలో దాడులు నిర్వహించి డ్రగ్స్ దందా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన సిద్దిఖ్అహ్మద్ పట్టుబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జగన్ బుర్రకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..తాడేపల్లి కొంప చుట్టూ డ్రగ్స్ మాఫియా; ఘాటుగా అనిత
గోవాలో డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్ .. బయటపడిన హైదరాబాద్ డ్రగ్స్ లింకులు
తెలుగురాష్ట్రాలను ఇప్పుడు డ్రగ్స్ లింకులు వణికిస్తున్నాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందని, ఏపీ డ్రగ్స్ వెనుక బిగ్ బాస్ ఎవరు అని పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ ఇటీవల టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ విచారణ సమయంలో తెలంగాణలో డ్రగ్స్ వెనుక అధికార పార్టీ ఉందన్న చర్చ జోరుగా సాగింది. హైదరబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ తమ కార్యాకలాపాలను నిర్వహిస్తుందని ఇప్పటికి అనేక మార్లు డ్రగ్స్ రాకెట్ లు పట్టుబడటం ద్వారా అర్ధం అయ్యింది. తాజాగా మరోమారు హైదరాబాద్ కు ఉన్న డ్రగ్స్ లింకులు గోవాలో ఓ డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్ తో బయటకు వచ్చాయి.
హైదరబాద్ శివార్లలో డ్రగ్స్ తయారీ .. గోవా, బెంగళూరు, ముంబై లకు అక్కడనుండే
తాజాగా గోవాలో డ్రగ్స్ వ్యాపారిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ కు ఉన్న లింక్ ను మరోమారు బయటపెట్టారు. హైదరాబాద్ నుండి శివారు ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక కంపెనీలలో డ్రగ్స్ తయారుచేసి గోవా, బెంగళూరు, ముంబై ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. గోవాలో అరెస్ట్ చేసిన డ్రగ్ వ్యాపారిని హైదరాబాద్ కు చెందిన సిద్దిఖ్ గా గుర్తించారు
నార్కోటిక్స్ అధికారులకు కీలక సమాచారం ఇచ్చిన సిద్ధిఖ్
హైదరాబాద్, గోవా లలో పలు ఈవెంట్లకు సిద్దిఖ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ముంబై, బెంగళూరు, హైదరాబాదులలో ఎల్ ఎస్ డి డ్రగ్స్ ను సిద్ధిఖ్ సప్లై చేస్తున్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. సిద్దిఖ్ ఛత్తీస్ ఘడ్ కు చెందిన నౌమాన్ సవేరి కి పార్ట్ నర్ గా అధికారులు గుర్తించారు. సిద్దిఖ్ ను విచారించిన నార్కోటిక్స్ అధికారులకు సిద్ధిఖ్ కీలక సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముంబై కే పరిమితం అనుకున్న డ్రగ్స్ దందా జోరుగా హైదరాబాద్ కేంద్రంగా విస్తరించినట్టు ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది.
ముంబైకి చెందిన డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ
ముంబైకి చెందిన డ్రగ్స్ మాఫియా హైదరాబాద్లోని కొన్ని పారిశ్రామిక ప్రాంతాలలో ఎండీఎంఏ డ్రగ్స్ ను తయారు చేస్తుందని, అక్కడి నుండే ప్రధాన నగరాలైన గోవా, బెంగళూరు, ముంబై రవాణా అవుతోందని వెల్లడించినట్లు సమాచారం. సిద్ధిఖ్ చెప్తున్న అంశాలకు ఊతమిస్తూ ఇటీవల బాలానగర్ లో ఇంట్లోనే డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు అయ్యింది. ఇక సిద్దిఖ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్సిబీ అధికారులు హైదరాబాద్ లో ముంబై డ్రగ్స్ తయారీ మాఫియాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లుగా సమాచారం.
Recommended Video
హైదరాబాద్ కేంద్రంగా ఎండీఎంఏ డ్రగ్స్ తయారుచేస్తున్న ముంబై డ్రగ్స్ మాఫియా
హైదరాబాద్ కేంద్రంగా ఎండీఎంఏ డ్రగ్స్ తయారవుతున్నాయన్న సమాచారం ఒక్కసారి అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ ఎన్సీబీ అధికారులు సిద్దిఖ్ నివాసం ఉండే ప్రాంతం, అతని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కాంటాక్టులను కనిపెట్టేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసే దాకా వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ, డ్రగ్స్ ఇతర ప్రధాన నగరాలకు సప్లై చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ నగరంలో చాప కింద నీరులా డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని, ముంబై మాఫియా హైదరాబాద్ ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చుకుందని కూడా తెలుస్తుంది.