ప్రారంభమైన తెలంగాణా మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. రాష్ట్రం లోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనుంది. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
324 డివిజన్లు, 2,647 వార్డులకు పోలింగ్
ఈ ఎన్నికల్లో మొత్తం 53.50 లక్షలు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోనున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్లలో మూడు డివిజన్లు , మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం అయ్యారు . దీంతో 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్ను నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు .
పోలింగ్కు నిర్వహణకు 50వేల మందికి సిబ్బందితో బందోబస్తు
పోలింగ్కు నిర్వహణకు 50వేల మందికి సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది . ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం 200 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 18 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 182 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పోటీలో 811 మంది అభ్యర్థులు ఉండగా, 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. అధికారులు 351 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1845 మంది సిబ్బంది, 2,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్ని రాజకీయ పార్టీలలోనూ టెన్షన్
రాష్ట్రం లోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు గీటురాయిగా మారనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారటంతో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది . ఇక అన్ని పార్టీల్లోనూ ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయనేది సుస్పష్టం.