మున్సిపల్ ఎన్నికల వేళ కవిత సైలెన్స్ .. నిజామాబాద్ లో బీజేపీకి అడ్వాంటేజ్
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎందుకు మౌనంగా ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో కవిత సైలెన్స్ పార్టీ కి చేటు చేస్తుందా...? నిజామాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్న కవిత నిరాసక్తత బిజెపికి అడ్వాంటేజ్ గా మారుతుందా ?అన్నది ఇప్పుడు నిజామాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నిజామాబాద్ లో ఓటమి తర్వాత ఒక్కసారి మాత్రమే నిజామాబాద్ వచ్చిన కవిత
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఊహించని ఈ పరిణామం టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించింది. ఇక తాను నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంపై కవిత స్పందిస్తూ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. తన కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు . ఇక ఆ తర్వాత ఒకేఒక్క సారి నిజామాబాద్ జిల్లాకు వచ్చారు కవిత . కవిత ఓటమితో కృంగిపోయి అన్నపానీయాలు, నిద్రాహారాలు మానేసిగుండెపోటుకు గురై మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు . ఎన్నికల్లో ఓడినా నిజామాబాద్ వీడనని చెప్పిన ఆమె ఆ తర్వాత కనిపించలేదు . పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కవిత జాడ లేదు. ఒక్క నిజామాబాద్ నియోజకవర్గంలోనే కాదు ,హైదరాబాద్ లోనూ ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో కవిత పాల్గొన్న దాఖలాలు లేవు. కనీసం టీఆర్ఎస్ సభ్యతవ నమోదు కార్యక్రమంలో కూడా కవిత పాల్గొనలేదు . ఆమె ఇంటికే వెళ్లి మెంబర్ షిప్ ఇచ్చిన పరిస్థితి.
ఓటమి తర్వాత ఇందూరుకు దూరంగా ఉన్న కవిత .. పార్టీలో సమన్వయ లోపం , పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం తర్వాత నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. కవిత జిల్లాకు దూరం కావటంతో పార్టీని సమన్వయం చేసే నేతలే కరువయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో పార్టీ కి అన్నీ తానై ముందుకు నడిపించేవారు కవిత . పార్టీ కార్యాకలాపాలన్నీ తానే దగ్గరుండి చూసుకునేవారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి పనులను ఆమె స్వయంగా పర్యవేక్షించేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఓటమి తర్వాత ఆమె ఇందూరు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. గులాబీ పార్టీ నేతల మధ్య సమన్వయం కూడా కొరవడింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు కవిత కానీ ఆమె గెలుపు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రమించలేదనే టాక్ ఉంది . ఇక జిల్లా మంత్రిగా ప్రశాంత్ రెడ్డి వ్యవహరిస్తున్నా, ఆయనతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి పని చేసేలా లేరని తెలుస్తుంది.
మున్సిపల్ ఎన్నికల వేళ కవిత సైలెన్స్ బీజేపీ కి అడ్వాంటేజ్
ఇందూరు రాజకీయాలకు కవిత దూరంగా ఉండటం బీజేపీకి కలిసోస్తున్న అంశం. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి చాపకింద నీరులా పని చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం తో బీజేపీ సైతం ప్రజల్లోకి దూసుకు వెళుతోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నే కాకుండా, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన పట్టు చేజారిపోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇక బీజేపీని నిలువరించడంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నేతలు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారు . మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇకనైనా కవిత మౌనం వీడుతారా? లేక ఇదే పంథా కొనసాగిస్తారా? ఒకవేళ ఇదే కొనసాగితే అది పార్టీకి మరింత చేటు చేస్తుందని చెప్పడం నిర్వివాదాంశం. ఇక ఈ సమయంలో కవిత ఏం చేయబోతున్నారనేది మాత్రం ఆసక్తికరం .