మున్సిపోల్స్ ఎఫెక్ట్ : మాజీ మంత్రికి షాకిచ్చిన కేటీఆర్.. సస్పెన్షన్ తప్పదా..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. ప్రగతి భవన్లో కేటీఆర్ను కలిసేందుకు వెళ్లిన జూపల్లికి అపాయింట్మెంట్ దొరకలేదు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసినందుకు అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆయనపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో జూపల్లి అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నది చర్చ జరుగుతోంది.
కొల్లాపూర్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన 20 మంది అభ్యర్థులపై జూపల్లి తన వర్గీయులను రెబల్స్గా పోటీ పెట్టారు. వారి తరుపున ప్రచారం కూడా చేశారు. 20కి 20 స్థానాలు రెబల్స్నే గెలిపించి టీఆర్ఎస్కు కానుకగా ఇస్తానన్నారు. అంతేకాదు, కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయులను గెలిపించుకోవడం ద్వారా స్థానిక ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అసమర్థుడు అని జూపల్లి నిరూపించాలనుకున్నారు. కానీ ఫలితాలతో కథ అడ్డం తిరిగింది.
జూపల్లి వర్గీయుల్లో 11మంది మాత్రమే గెలుపొందారు. 9 స్థానాల్లో టీఆర్ఎస్ నేతలు గెలుపొందారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జూపల్లి వర్గీయులపై ఆధారపడాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేకుండా పోయింది. జిల్లాకు చెందిన ఎంపీ,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ సభ్యుల ఎక్స్అఫీషియో ఓట్లతో ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జూపల్లికి కేటీఆర్ అపాయింట్మెంట్ నిరాకరించినట్టు సమాచారం. శనివారం తెలంగాణ భవన్లోనూ కేటీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. కేవలం ఒక నిమిషం మాత్రమే జూపల్లితో ఆయన మాట్లాడినట్టు సమాచారం. ఆదివారం ఉదయం కేటీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్ వెళ్లిన ఆయన.. అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన జూపల్లిని సస్పెండ్ చేయాలని విష్ణువర్దన్ రెడ్డి సహా స్థానిక నేతలు కేటీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నారు.
దీంతో టీఆర్ఎస్ అధిష్టానం జూపల్లి విషయంలో ఎలాంటి చర్యలకు సిద్దపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి జూపల్లిపై గెలిచిన విష్ణువర్దన్ రెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జూపల్లి,విష్ణువర్దన్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.