టీఆర్ఎస్ పార్టీకి ఇది హెచ్చరికే: కొంపల్లిలో చెల్లని ఓట్లతో గెలిచిందంటూ లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణలోని 120 మున్సిపాలిటీల్లో 4 మినహా అన్ని చోట్లలో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకున్నా.. తమ అభ్యర్థులు గెలిచారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు
టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరికలు.. బీజేపీ ఎక్కడుందంటే..
మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు అధికార టీఆర్ఎస్కు హెచ్చరికలన్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని.. బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. కాంగ్రెస్ కనుమరుగవుతోందని అన్నారు. కేటీఆర్ సిరిసల్లలో సగానికి సగం గెలవలేకపోయారన్నారు లక్ష్మణ్. మున్సిపల్ ఫలితాలు బీజేపీ పోటీయే కాదంటున్న కేటీఆర్కు సమాధానం చెప్పాయన్నారు. సిరిసిల్లలో చూస్తే బీజేపీ ఎక్కడుందో కనిపిస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సీఎం కూతురు ఓడిందన్నారు.
వార్డుకు కోటి ఖర్చు.. క్యాంపులు ఎందుకు?
హైదరాబాద్ నగరపాలక, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఛాలెంజ్గా తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాటాలు చేస్తామన్నారు. సంక్షేమ పథకాలు నీరుగారిపోయినై.. పథకాలు గెలిపిస్తాయంటే డబ్బులు ఎందుకు పంచారని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. మున్సిపల్ వార్డులో కోటి రూపాయలు ఖర్చు పెట్టిన దేశంలో చరిత్ర ఎక్కడాలేదని అన్నారు. మేయర్, చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించారు. క్యాంపులు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు.
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా టీఆర్ఎస్..
అనేక స్థానాల్లో సీనియర్ నేతలు వ్యతిరేకంగా పనిచేస్తే టీఆర్ఎస్ చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ అన్నారు. రెబల్స్పై చర్య తీసుకునే ధైర్యం లేదని విమర్శించారు. 16 మందిని రెబల్స్ను గెలిపించిన జూపల్లిని కేటీఆర్ పిలిపించారని అన్నారు. టీఆర్ఎస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా మారిందన్నారు.
చెల్లని ఓట్లతో బీజేపీని ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు
కొంపల్లి వార్డు 3లో తమ అభ్యర్థి గెలిచే పరిస్థివుంటే చెల్లని ఓట్లను తీసి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించారని.. సదరు అధికారిపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉందా? అని ప్రశ్నించారు. సారు కారు 16 అంటే ఏం ఫలితాలు వచ్చాయో గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో కూడా దీటైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలు చెప్పారని అన్నారు.
కాంగ్రెస్ ఓడిపోతే బాధ.. బీజేపీ అంటే భయం..
కాంగ్రెస్ ఓడిపోతే టీఆర్ఎస్ బాధపడుతోందని లక్ష్మణ్ అన్నారు. తమకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని టీఆర్ఎస్ చెప్పుకుంటోందని అన్నారు. బీజేపీ అంటే భయం లేకుంటే అక్రమార్గులు ఎందుకు అని ప్రశ్నించారు. 21 మంది ఎమ్మెల్యేలుండి కాంగ్రెస్ చతికిలపడిందన్నారు. మున్సిపల్ ఫలితాలు పరిశీలించి భవిష్యత్లో సమీక్షించుకుంటామన్నారు.
బైంసాను ఎంఐఎంకు వదిలేసింది..
టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ను బలోపేతం చేస్తోందని లక్ష్మణ్ మండిపడ్డారు. బైంసా లాంటి ఘటనలు జరిగినా చర్యలు తీసుకోలేదని అన్నారు. బైంసాను ఎంఐఎంకు టీఆర్ఎస్ వదిలేసిందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ ఉందని ఈ ఎన్నికలు సంకేతమిచ్చాయన్నారు. బీజేపీ 260 స్థానాల్లో కౌన్సిలర్లు గెలిచినట్లు తెలిపారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకున్నా మంచి ఫలితాలు సాధించిందన్నారు.