మున్సిపల్ ఎన్నికలపై విచారణ జాప్యం .. టీఆర్ఎస్ కు చేస్తుందా నష్టం !!
తెలంగాణ రాష్ట్రంలోని అధికార టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలని భావిస్తోంది. అందుకోసం నిన్న జరిగిన విచారణలో హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావించింది. అయితే హైకోర్ట్ ఈ కేసును 26 వ తారీఖుకి వాయిదా వేసింది. దీంతో టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలు జాప్యం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
సాగర్ మహాస్తూపంపై కేసీఆర్ చిత్రం.. యాదాద్రి ఘటనతో తొలగింపు .. అక్కడ కూడా శిల్పిదే తప్పా !!
మున్సిపల్ ఎన్నికలపై విచారణ 26కు వాయిదా వేసిన హై కోర్టు
గతంలో మున్సిపల్ ఎన్నికల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి అక్షింతలు వేసిన హైకోర్టు చిన్న చిన్న లోపాలున్నా ఎన్నిక ఆగకూడదని చెప్పింది. కానీ తాజాగా ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల నిర్వహణకు జరగాల్సిన ఈ ప్రక్రియ అంతా జరిగినట్లుగా కోర్టుకు నివేదిక అందించినా ఈ కేసును విచారించిన హైకోర్టు మళ్లీ దీనిని వాయిదా వేసింది. దీంతో ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆలస్యం అమృతం విషం అని భావిస్తోంది గులాబీ పార్టీ.
మున్సిపల్ ఎన్నికలు జాప్యం అయ్యే కొద్దీ బిజెపి బలపడుతుందన్న ఆందోళనలో టీఆర్ఎస్
ఇక ఇంతలా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల గురించి ఆలోచించడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకపక్క బిజెపి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దింపి జిల్లాలో చక్రం తిప్పుతుంది. మున్సిపల్ ఎన్నికలు జాప్యం అయ్యే కొద్దీ బిజెపి బలపడుతున్న భావన టీఆర్ఎస్ నేతల్లో ఉంది.
అమిత్ షా పర్యటన నేపధ్యంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తి
అందుకే సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని గులాబి నేతలు తెగ తాపత్రయ పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో తమ సత్తా చాటాలని ఇప్పటికే బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఇక అంతే కాకుండా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచనా దినంగా నిర్వహించడానికి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఎన్నికలపై జరుగుతున్న జాప్యం .. బీజేపీకి లాభం అనే ఆందోళన
ఇక ఇప్పటికే పలు పార్టీల నుండి బిజెపిలో చేరడానికి నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనతో ఒకింత టీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్పదని టిఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఇక అంతే కాకుండా హుజూర్ నగర్ ఎన్నిక తేదీని సైతం మిగతా రాష్ట్ర ఉప ఎన్నికలతో పాటు ప్రకటించకపోవడం టిఆర్ఎస్ పార్టీలో ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం జరుగుతున్న జాప్యం బీజేపీ కలిసి వస్తుందేమో అన్న అనుమానం టిఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది. ఇప్పటికే బిజెపి ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నా , బిజెపి పట్ల కారు పార్టీ లో కాస్త టెన్షన్ కనిపిస్తోంది.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర సర్కార్ తీరుపై అక్కసు వెళ్ళగక్కిన కేసీఆర్
కేంద్ర సర్కార్ తో స్నేహం చేసి ముందుకు నడవాలి అనుకున్న కెసిఆర్, తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీపై, బిజెపి అధినాయకత్వంపై మండిపడుతున్నారు . అందులో భాగంగానే కెసిఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించ లేదని, తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి బోలెడంత పన్నులు కడుతుందని అసెంబ్లీ వేదికగా చెప్పి తన అక్కసు వెళ్లగక్కారు. మొత్తానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరిగితే అది గులాబీ పార్టీకి నష్టమే చేకూరుస్తుందని అంచనా.