ఎల్ఈడీ బల్బులతో 40 శాతం కరెంట్ బిల్లు ఆదా, కాళేశ్వరంతో కోనసీమగా తెలంగాణ: కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది సోషల్ మీడియా అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యతిరేక వార్తలు రాసినా.. సోషల్ మీడియా మాత్రం వాస్తవాన్ని ప్రతిబింబించిందన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని శ్రేణులకు మార్గదిర్గేనం చేశారు. 200 మంది మీడియా కార్యకర్తలు సహా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
40 శాతం ఆదా..
తెలంగాణ మున్సిపాలిటీలో ఎల్ఈడీ వీధిలైట్లు పెట్టడం ద్వారా 40 శాతం కరెంట్ బిల్లు ఆదా అయ్యిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు పాలమూరులో 15 రోజులకు మంచినీళ్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఆనాడు ఉద్యమనేత శ్రీనివాస్ గౌడ్ సాక్షి అని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు మున్సిపాలిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది.. ఐదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎంత ఖర్చు చేసిందో తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆనాడు ఖర్చుచేసిన వ్యయం గురించి అప్పటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఓరుగల్లుకు 300 కోట్లు
ఉమ్మడి రాష్ట్రంలో 65 మున్సిపాలిటీలు ఉండేవని.. వాటికి అదనంగా మరో 75 మున్సిపాలిటీలు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. వరంగల్, కరీంనగర్, రామగుండం మున్సిపాలిటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు. వరంగల్ మున్సిపాలిటీ కోసం రూ.300 కోట్లు, జీహెచ్ఎంసీ కోసం కూడా నిధులు కేటాయించామని తెలిపారు.
ప్రతిభకు పట్టం..
ఇదివరకు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ప్రారంభించిన చోటే పదవీ విరమణ చేసేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మార్చివేశామని చెప్పారు. ‘తెలంగాణ యునిఫైడ్ సర్వీస్ రూల్స్' ప్రకారం మంచిగా పనిచేసే వారిని ఇతర చోటకు బదిలీ చేస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా వారి సేవలు అవసరం ఉన్నందున తప్పడం లేదు. సరిగా పనిచేయని వారికి కూడా స్థానచలనం తప్పదని హెచ్చరించారు.
కోనసమీగా..
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ప్రథమ ప్రాధాన్యమని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కోనసీమగా మారడం ఖాయమన్నారు. సీతారామ, పామలూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం, దేవాదులతో జలకళ నెలకొందన్నారు. మిషన్ భగీరథ ఇంటింటికీ తాగునీరు సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతోందన్నారు. జలకళతో సంపద సృష్టించగలుగుతామని, సంపదతో సంస్కారం వస్తోందని చెప్పారు.
75 గజాల్లోపు ఉంటే
కొత్త పంచాయతీరాజ్ చట్టంతో ప్రణాళికమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. 75 గజాల లోపు ఇంటి స్థలం ఉంటే స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇళ్లు నిర్మించుకోవచ్చని సూచించారు. అయితే 12 అంతస్తులు భవనం నిర్మిస్తామంటే కుదరదని చెప్పారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేసే అధికారం కొత్త పంచాయతీరాజ్ చట్టానికి ఉందన్నారు. అలాగే 75 గజాలపై స్థలానికి సంబంధించి ఇంటి నిర్మాణం కోసం 21 రోజుల్లో అనుమతి ఇస్తామన్నారు. టీఎస్ ఐపాస్ లాగా టీఎస్ పీసాస్ తీసుకొచ్చామని.. 21 రోజుల్లో అనుమతి రాకుంటే 22వ రోజు డీమ్డ్ ఆఫ్రూవల్ కింద భవన నిర్మాణం చేసుకోవచ్చని చెప్పారు.
తమవారిపై చర్యలు..
కొత్త పంచాయతీరాజ్ చట్టంతో కౌన్సిలర్, వైస్ చైర్మన్, చైర్మన్లపై కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. తప్పు చేస్తే టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కూడా ఉపేక్షించబోమని.. ఇటీవల సిరిసిల్లలో తాని విషయాన్ని కార్యకర్తలకు చెప్పినట్టు తెలిపారు. తప్పు జరిగితే మన వాళ్ల నుంచి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరాక.. ఫిబ్రవరి, మార్చిలో టీఆర్ఎస్ కౌన్సిలర్లకు పటిష్టమైణ శిక్షణ అందజేస్తామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం గురించి శిక్షణ ఇస్తామన్నారు.