మున్సిపాలిటీకి డిమాండ్ నోటీసు ఏంటీ ? బరాబర్ ఇస్తాం .. సభలో కేసీఆర్, శ్రీధర్ బాబు మధ్య హాట్ డిస్కషన్
హైదరాబాద్ : తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా సభలో ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పంచాయతీరాజ్ చట్టం అమలు, బకాయి వసూల్ అంశంపై వీరి మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది.
డిమాండ్ నోటీసు ఇస్తారా ? శ్రీధర్ బాబు
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు బదులు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే బాగుండేదని శ్రీధర్ బాబు సూచించారు. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు సక్రమంగా చేసే వెసులుబాటు ఉండేదన్నారు. అలాగే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నిధులు లేవని .. అలాగే రాబడి కూడా లేదని గుర్తుచేశారు. ఇటీవల జగిత్యాల మున్సిపాలిటీకి మిషన్ భగరీథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పంపిన డిమాండ్ నోటీసును సభలో ప్రస్తావించారు. జగిత్యాలలో మున్సిపాలిటీ వాడిన నీటికి సంబంధించి రూ.2.50 కోట్లు బకాయి చెల్లించాలని నోటీసులు పేర్కొన్నారని గుర్తుచేశారు. ఓ వైపు ప్రభుత్వం నిధులు ఇవ్వదు .. మరోవైపు రాబడి లేదు .. ఈ సమయంలో ఈ నోటీసులేంటని మండిపడ్డారు.
ఈ పాపం మీదే .. కేసీఆర్
శ్రీధర్ బాబు మాట్లాడుతుండగానే కల్పించుకుని కేసీఆర్ మాట్లాడారు. ఈ పాపానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. సభను శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. బడ్జెట్ లో పంచాయతీలకు నిధులు లేవని సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలు నెరవేరిస్తే .. మేం తొంగలో తొక్కామా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఇంటి పన్నును రివైజ్ చేసి అమలు చేస్తామని .. విధిగా పన్నులు వసూల్ చేస్తామని చెప్పారు. బకాయి వసూల్ చేయడంతో .. వీధి దీపాలు, మంచినీళ్ల నిధులకు సమస్య ఉండదని తేల్చిచెప్పారు.
బరాబర్ నోటీసు ఇస్తాం ..?
జగిత్యాల మున్సిపాలిటీకి నోటీసు ఇస్తారా అని శ్రీధర్ బాబు ప్రశ్నించడంతో బరాబర్ నోటీసు ఇస్తామని స్పష్టంచేశారు సీఎం కేసీఆర్. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతో ఏళ్లుగా బకాయి ఉన్న పన్నులు వసూల్ అవుతాయని .. దీంతో పంచాయతీలు, మున్సిపాలిటీలకు భారీగ ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఆ నగదుతో వీధి దీపాలు, మంచినీరు, ఇతర మౌలిక వసతుల కోసం వెచ్చించాలని సూచించారు.
మీవి మాటలు .. మావి చేతలు
గత 50 ఏళ్లలో చేయనిది నాలుగున్నరేళ్లలో చేసి చూపించామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో మొక్కుబడిగా సోలార్ విద్యుత్ ఉండేదని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీ 3600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. సోలార్ ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదన్నారు. అలాగే కరెంట్ వినియోగంలో దేశంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ తెలపిందని గుర్తుచేశారు.