ఓయు విద్యార్థి ఆత్మహత్యలో ట్విస్ట్: సూసైడ్ నోట్ మార్చారా?
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న మురళి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. మురళి సూసైడ్ నోట్ను పోలీసులు మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మురళి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిన వెంటనే వందలాది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు తరలించకుండా నిరోధించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Recommended Video
బలగాలతో నిండిపోయిన ఓయు
తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రరత్యేక పోలీసు బలగాలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్లతో పాటు పోలీసు బలగాలతో ఉస్మానియా క్యాంపస్ నిండిపోయింది. తీవ్ర ఉద్వేగ పరిస్థితులు నెలకొన్న సమయంలోనే తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అక్కడికి చేరుకున్నారు. రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ కూడా వచ్చారు..
నిరుద్యోగమే కారణమని ఆరోపణలు....
మురళి ఆత్మహత్యకు నిరుద్యోగమే కారణమని, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో చేస్తున్న జాప్యం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందనే వమర్శలు వినిపించాయి. మురళి సూసైడ్ నోట్ను పోలీసులు మార్చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అతని చేతిరాతతో పోలీసులు చూపిస్తున్న చేతి రాత కలవడంలేదని అన్నారు.
సంఘటన నుంచి దృష్టిని మళ్లించడానికే....
సంఘటన నుంచి దృష్టి మళ్లించడానికే పోలీసులు సూసైడ్ నోట్ను మార్చేశారని, ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఓయు జెఎసి నాయకుడు శ్రీశైలం అన్నారు. మురళి కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిరుద్యోగ జెఎసి చైర్మన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. క్యాంపస్లోని ఫోరెన్సిక్ నిపుణులతో అటాప్సీ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు
పోలీసులు మురళి మృతదేహాన్ని హాస్టల్ బాత్రూం నుంచి తరలించే సమయంలో విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతదేహాన్ని తరలించడానికి అదనపు బలగాలను రప్పించారు.
పారదర్శకంగా దర్యాప్తు
మురళి ఆత్మహత్యపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని ఎసిపి నర్సయ్య చెప్పారు. ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మురళి పాకెట్ నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించారు. నిఘా విభాగం అధికారులు కూడా సమాచారాన్ని సేకరించారు. తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.
చల్లబరచడానికి వైస్ చాన్సలర్ ఇలా...
కెసిఆర్ డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో నెలకొన్న ఉద్వేగాన్ని చల్లార్చడానికి ఓయు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం ప్రయత్నించారు. మురళి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని, పోలీసులు మురళి గది నుంచి పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, వారు దర్యాప్తు చేస్తారని రామచంద్రం హామీ ఇచ్చారు.
మురళి తెలివైన విద్యార్థే.
పరీక్షలు డిసెంబర్ 14వ తేదీన ఉన్నాయని, తరగతి గది పరీక్షల్లోనూ ప్రాక్టికల్ పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించాడని, అయితే, ఎక్కడ తప్పు జరిగిందనేది తెలియడం లేదని రామచంద్రం అన్నారు.