1993లో మర్డర్: 24ఏళ్ల తర్వాత ఏ-2 నిందితుడు దొరికాడు..
1993లో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించి 24ఏళ్ల తర్వాత ఏ-2నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్: ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని 24సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకోగలిగారు. ఎస్ఆర్ నగర్ పరిధిలోని శ్యాలమకుంట స్థల వివాదం కారణంగా అప్పట్లో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. బీకేగూడలోని శ్యామలకుంటలో స్థల వివాదం నేపథ్యంలో ఐదుగురు మిత్రుల మధ్య గొడవ తలెత్తింది. డబ్బు వసూలు విషయంలో విబేధాలు తలెత్తడంతో ఐదురుగు ఘర్షణ పడ్డారు. ఈ వివాదంలో ఎరుపు లక్ష్మయ్య అలియాస్ లక్ష్మణ్ పై మిగతా నలుగురు మిత్రులు కక్ష పెంచుకున్నారు.
ఒక పథకం ప్రకారం అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. జనవరి 12, 1993లో ఏజీ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లక్ష్మణ్ పై దాడి చేశారు. ఆపై కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి విజయ్కుమార్, లింగమయ్యలను పోలీసులు అప్పట్లోనే అరెస్టు చేశారు. ఇక ఏ-2గా ఉన్న కురవ కృష్ణ చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు.
కొంతకాలం బెంగళూరులో ఉన్న అతను తర్వాత కర్నూలులో స్థిరపడినట్లు పోలీసులు గుర్తించారు. 1993లో జరిగిన హత్య కేసులో వారెంటు పెండింగ్లో ఉండటంతో పాత డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీసుల దృష్టి ఈ కేసుపై పడింది. దీంతో ఒక టీమ్ గా ఏర్పడిన ఇన్స్పెక్టర్లు వహీదుద్దీన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సతీష్, జి.శ్రీనివాస్, సంజయ్కుమార్, కిరణ్కుమార్లు ఎట్టకేలకు కురవ కృష్ణను కర్నూలులో పట్టుకోగలిగారు. ప్రస్తుతం హనుమంతరావు కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు.