కొట్టుకుపోయిన మూసీ ప్రాజెక్టు గేటు: వృథాగా పోతున్న నీరు, డెడ్స్టోరేజీకి వెళ్లే ప్రమాదం
హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్దదైన మూసీ ప్రాజెక్టు ఆరో నంబర్ రెగ్యూలేటరీ గేటు శనివారం సాయంత్రం కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులో భారీగా చేరిన వర్షపు నీరు దిగువన్న ఉన్న మూసీ నదిలోకి వృథాగా పోతోంది.
అంచనా వేయకపోవడం వల్లే..
హైదరాబాద్ తోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పైనుంచి వస్తున్న వరదను పూర్తి స్థాయిలో అంచనా వేయకపోవడం వల్లే గేటు కొట్టుకుపోయిందని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.
నాణ్యతా లోపమే..
రెండేళ్ల క్రితం(2017)లో ప్రభుత్వం విడుదల చేసిన రూ. 18 కోట్లతో మరమ్మతులు చేపట్టినప్పటికీ.. రెగ్యూలేటరీ గేటు కొట్టుకుపోవడం పనుల్లో నాణ్యత ఏపాటిదో తెలుస్తోంది. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 4.4 టీఎంసీలు(645 అడుగులు) కాగా, గేటు కొట్టుకుపోయే సమయానికి ప్రాజెక్టులో 4.3 టీఎంసీల(6445 అడుగులు) మీరు నీరు ఉంది.
డెడ్ స్టోరేజీకి వెళ్లే ప్రమాదం
ప్రాజెక్టుకు మొత్తం 8 రెగ్యూలేటరీ గేట్లు ఉన్నాయి. 12 క్రస్ట్ గేట్లున్నాయి. తాజాగా రెగ్యూలేటరీ గేటు కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ(612 అడుగులు)కి పడిపోయే ప్రమాదం నెలకొంది.
ఆయకట్టుపై ప్రభావం
శనివారం రాత్రి ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి.. అధికారులను నీరు వృథాగా పోవడంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, మూసీనది ప్రాజెక్టు కింద నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో 42 గ్రామాల కింద 33వేల ఎకరాల ఆయకట్టు ఉండటం గమనార్హం. అయితే, గేటు కొట్టుకుపోవడం వల్ల నీరంతా ప్రాజెక్టు నుంచి వృథాగాపోతే.. ఈ ఆయకట్టు సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.