చచ్చేదాకా ఇక్కడే: చక్రి తల్లి, కోడలి పేరు మీద ఆస్తుల చిట్టా విప్పారు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యులు.. తల్లి, సోదరుడు మూడ్రోజులుగా సోమాజిగూడలోని విల్లా వద్దనే బైఠాయించారు. ఈ సందర్భంగా తల్లి మాట్లాడుతూ... తాము కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని చెప్పారు. అన్నీ ఆస్తులు తన కోడలు పేరుమీదే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజులుగా చక్రి తల్లి, సోదరుడు విల్లా వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వారు ఓ ఛానల్తో మాట్లాడారు. ఆమె లక్షలు కోట్లు తీసుకు వెళ్లిపోయిందన్నారు. మాకు ఇక్కడ ఏం లేకుండా పోయిందన్నారు. ఇంత దుర్మార్గం ఏ కోడలు చేయదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటామని, చచ్చేదాకా ఉంటామన్నారు. తనకు ఇప్పుడు పెన్షనే ఆధారమని చెప్పారు. ఆస్తులు అన్నీ తన కోడలు పేరు మీదే ఉన్నాయని చెప్పారు.
చక్రి సోదరుడు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఆస్తి ఉందని చెప్పారు. అన్నయ్య చనిపోయాక.. ఏం సంపాదించలేదని చెప్పారని కాని చాలా ఆస్తి ఉందని చెప్పారు. తమకు కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పారు. అందుకోసమే తన తల్లి పోరాడుతోందన్నారు.
మొయినాబాదులో, సోమాజిగూడలో, శామీర్ పేటలో, శంషాబాదులో ప్లాట్లు, ఇళ్లు ఉన్నాయని చెప్పారు. గుంటూరులో అయిదెకరాల పొలం ఉందని చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లాట్ను అమ్మేసుకున్నారని, ఓ ఆడి కారు ఉందని చెప్పారు.