మై బీ చౌకీదార్ : కాంగ్రెస్, టీఆర్ఎస్పై మోదీ విసుర్లు, పాలమూరులో విజయసంకల్ప యాత్ర
పాలమూరు : మై బీ చౌకీదార్ .. ఇప్పటికీ, ఎప్పటికీ అంటూ పాలమూరు బీజేపీ శ్రేణులు, ప్రజల్లో ఉత్సాహం నింపారు మోదీ. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది 60 నెలల్లో బీజేపీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూడాలని కోరారు. దేశ రక్షణ, సమగ్రత, అభివృద్ది కోసం రాజీలేకుండా పోరాడినట్టు పేర్కొన్నారు. శుక్రవారం భూత్పూరులో విజయసంకల్ప యాత్ర బహిరంగ సభలో ఆశేష జనవాహిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
అందరికీ నమష్కారం : మోదీ
తొలుత మోదీ పాలమూరు గడ్డ, తెలంగాణ బిడ్డలకు నామస్సుమంజలి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మీ ఆశీర్వాదం కోసం కాపాలాదారుడు ఇక్కడికి వచ్చాడని గుర్తుచేశారు. బీజేపీకి మరోసారి అధికారం ఇవ్వాలని, నవభారత నిర్మానం కోసం పునరంకితమవుతామని పేర్కొన్నారు. మీరు వేసే ఓటు ప్రధాని కోసం కాదు దేశం కోసం వేయాలి అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు మోదీ.
వారిది నయవంచన
గత పాలకులు దళితులు, వెనుకబడిన వర్గాలను వంచించారని విమర్శించారు. దేశాభివృద్ధి కోసం పాటుపడుతుంటే తనపై బురదజల్లారని మండిపడ్డారు మోదీ. టీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన అని విమర్శించారు మోదీ. కూతురు, కొడుకు, అల్లుడు కోసం పార్టీ అని .. కేసీఆర్ అంటే స్వార్థ రాజకీయాలేనని ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు.
ఆ జ్యోతిష్యుడి ఏం చెబితే అదే
జ్యోతిష్యుని సలహామేరకు ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారని ఆరోపించారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో కేసీఆర్కు అంతా బాగుండదని, తిరిగి ప్రభుత్వం ఏర్పడదని తెలుపడంతో తన స్వార్థం కోసం ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల వరకు క్యాబినెట్ ఏర్పడలేదని .. కేసీఆర్కు అత్యంత విశ్వసనీయమైన జ్యోతిష్యుడి సలహామేరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆ 3 నెలలు కేసీఆర్ ఆడింది ఆట, పాడింది పాట అని విమర్శించారు.
వారికి ప్రతీది రాజకీయమే
విపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రతీది రాజకీయమే. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో శాటిలైట్ పడగొట్టి చరిత్ర సృష్టించినా, మన జవాన్లు శత్రుదేశంలో ఉగ్ర స్థావరాలను నెలమట్టం చేసినా, ఆధారాలు కావాలని రాజకీయం చేస్తారని మండిపడ్డారు మోదీ. వారి నీతిమాలిన రాజకీయాలను ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని చెప్పారు మోదీ.
తెలంగాణకు చేసిందిదీ ?
తెలంగాణలో జాతీయ రహదారులు నిర్మాణం, రైల్వేలైన్ల విషయంలో కూడా పెద్దపీట వేశాం. గత ఐదేళ్లలో తెలంగాణకు రైల్వే కేటాయింపులు పెరిగాయని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ది కోసం చిత్తశుద్ధితో పనిచేశామని, అయితే కేసీఆర్ సర్కార్ సహకరించలదేని పేర్కొన్నారు. ఇళ్లు లేని పేదలకు గూడు నిర్మిస్తున్నామని .. దేశంలో కోటి 50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ ఇళ్లను తీసుకోక .. తామే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పి బీరాలు పలికిందని మండిపడ్డారు. ఐదేళ్లలో 7 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని చెప్పారు మోదీ. రిజర్వేషన్ల పేరుతో ఓట్లు దండుకున్నది కాంగ్రెస్ పార్టీనని .. అందరికీ సముచిత గౌరవం కల్పించింది బీజేపీనని స్పష్టంచేశారు. మై బీ చౌకీదార్ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి ప్రసంగించారు.