ప్రణయ్ని నయీమ్ బ్యాచ్తో మా నాన్నే చంపించారు, మొదట్నుంచీ.. : అమృత కన్నీటిపర్యంతం
హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం పరువు హత్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రణయ్ అనే యువకుడిని అతని భార్య తరపు బంధువులు అతి కిరాతకంగా అంతమొందించారు. ఈ ఘటన గురించి ప్రణయ్ భార్య అమృత మీడియాతో మాట్లాడారు.
హత్యకు 3నెలల నుంచి ప్లాన్: కూతుర్ని వదిలేస్తే రూ.3 కోట్లు.. ప్రణయ్కి అమృత తండ్రి ఆఫర్?
మా నాన్నే చంపించారు.. నయీం బ్యాచ్తో..
తన తండ్రి, బాబాయ్లే నయీం బ్యాచ్తో ప్రణయ్ను హత్య చేయించారని అమృత ఆరోపించారు. ‘ప్రణయ్ని హత్య చేయించింది మా నాన్నే. ఆయన ఆలోచనల గురించి అమ్మ ఎప్పటికప్పుడు చెప్పేది. ప్రణయ్ని చంపేందుకు చాలా రోజులు రెక్కీ నిర్వహించారు' అని చెప్పింది.
పక్కనుండగానే చంపేశారు..
‘నేను, ప్రణయ్ నవ్వుకుంటూ వెళ్తున్న సమయంలో పక్క నుంచి ఎవరో గట్టిగా కొట్టారు. వెంటనే ప్రణయ్ కిందపడిపోయాడు. అనంతరం దాడి చేసి అతన్ని చంపేశారు. ఎవరు దాడి చేశారో నేను స్పష్టంగా చూడలేదు' అని అమృత తెలిపింది.
నా ప్రతీ కదలికలపై నిఘా
‘నా కదలికలను ఎప్పటికప్పుడు మా నాన్న తెలుసుకునేవారు. మాపై మా నాన్న నిఘా ఉంచారు. గోల్డ్షాప్లో ఉన్నావ్.. బ్యూటీపార్లర్లో ఉన్నావ్.. అని మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పేది. నాన్నకు మా గురించి ఎవరో కాల్ చేసి చెప్పారని అంటుండేది. మేం ఎక్కడ ఉన్నా క్షణాల్లో మా నాన్నకు తెలిసిపోయేది. మా నాన్న ఆలోచనల గురించి కూడా మా అమ్మ నాకు చెప్పేది. ప్రస్తుతం నేను ఐదు నెలల గర్భవతిని. ఈ విషయం అమ్మకు చెప్పాను. మొదట నాన్న నేను గర్భవతిని అని చెప్పకూడదన్నారు. అయితే, రెండు నెలల తర్వాత నేను అమ్మకు చెప్పాను. అప్పటి నుంచి అమ్మ ఫోన్ చేస్తూ నా ఆరోగ్యం గురించి అడుగుతూ ఉండేది. అయితే నాన్న మాత్రం గర్భం తొలగించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చేవారు' అని అమృత వాపోయారు.
నాన్నకు ప్రణయ్ని చంపేశారని ఫోన్ చేస్తే..
‘ప్రణయ్ చనిపోయిన వెంటనే ఈ ఘటన గురించి నాన్నకు ఫోన్ చేశా. ఎవరో దాడి చేసి ప్రణయ్ని చంపేశారు అని చెప్పా. అయితే వినిపించడం లేదని నాన్న ఫోన్ పెట్టేశారు. నాపై కూడా దాడి చేశారని చెప్పినా పట్టించుకోలేదు. ఆస్పత్రికి వెళ్లు అని మాత్రం చెప్పారు. వెంటనే ప్రణయ్ వాళ్ల నాన్నకు కూడా ఫోన్ చేశా. ప్రణయ్ని చంపేస్తే నేను వెనక్కి వస్తాననుకొని ఇలా చేశారు. అయితే నేను నాన్న వద్దకు వెళ్లను. ప్రణయ్ చాలా మంచివాడు. దారుణంగా చంపేశారు' అని అమృత కన్నీరుమున్నీరైంది.
చిన్ననాటి నుంచి ప్రణయ్ అంటే ఇష్టం.. బాబాయ్ కొట్టేవారు
ప్రణయ్ తాను చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నామని చెప్పిన అమృత.. భర్త అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ప్రణయ్ను ప్రేమిస్తునాన్నని తెలుసుకున్న బాబాయ్ తనను డంబెల్తో కొడుతూ.. కిందపడేసి తన్నేవాడని తెలిపారు. ప్రణయ్తో మాట్లాడితే తనను చంపేస్తానని తండ్రి బెదిరించేవాడని అమృత గుర్తు చేసుకున్నారు. తన భర్తను చంపేస్తేనైనా పుట్టింటికి వెళ్తానని భావించారని.. కానీ ఎప్పటికీ అలా జరగదని విలపించారు.
అమ్మాయి కుటుంబీకులే చంపారంటూ ప్రణయ్ తండ్రి..
కాగా, అమ్మాయి ప్రోద్భలంతోనే ప్రణయ్ పెళ్లి జరిగిందని అతని తండ్రి బాలస్వామి తెలిపారు. తనకు తెలియకుండానే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. పెళ్లి అయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు చాలాసార్లు బెదిరించారని తెలిపారు. దీంతో అమ్మాయిని తీసుకెళ్లమని మేం చాలాసార్లు వారికి చెప్పామన్నారు. అమ్మాయి కుటుంబసభ్యులే తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని బాలస్వామి ఆరోపించారు.
నిందితుల అరెస్ట్..
ఈ పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కిరాతకానికి పాల్పడిన యువతి తండ్రి, బాబాయిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఏ1 నిందితుడు మారుతీరావు, ఏ2 నిందితుడు శ్రవణ్కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఘటన అనంతరం కారులో పారిపోయిన నిందితుల గురించి పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు.