హృదయ విదారకంగా ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్ నోట్ .... నా చావే చివరిది కావాలని లేఖ
ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో మరణమృదంగం మోగుతోంది. హృదయ విదారకమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు. మనస్తాపం చెందిన కొందరు గుండెపోటుతో మృతి చెందగా, మరికొందరు ఆత్మహత్యల బాట పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేష్ ఆర్టీసీ సమస్య పరిష్కారం కాదన్న వేదనతో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నారు.
పురుగులమందు తాగి మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య .. మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్తత
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నరేష్ సూసైడ్ నోట్
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నరేష్ తన మరణానికి సీఎం కేసీఆర్ కారణమంటూ లేఖ రాశారు. ఆర్టీసీ డ్రైవర్ నరేష్ రాసిన లేఖ ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. హృదయవిదారకంగా సాగిన ఈ లేఖలో నరేష్ సీఎం కేసీఆర్ కు తన విన్నపాన్ని తెలియజేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విన్నపము అంటూ సాగిన లేఖలో అనేక విషయాలు ప్రస్తావించారు నరేష్ .
సీఎం కేసీఆర్ దయ చూపాలని వేడుకోలు
ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేశామని చెప్పడం చాలా బాధాకరమని లేఖలో పేర్కొన్నాడు నరేష్. అంతేకాదు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ అయిన ఆర్టీసీ విలీనాన్ని సీఎం కేసీఆర్ తప్పకుండా చేయాలని వేడుకుంటున్నాను అని తన లేఖలో పేర్కొన్నారు. తమపై దయ చూపి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నాను అని లేఖలో పేర్కొన్నారు. మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాము సారు అంటూ చాలా దయనీయంగా విన్నవించుకున్నాడు.
హైకోర్టు ఈర్పు కోసం ఎదురు చూశానని లేఖలో పేర్కొన్న నరేష్
ఇక అంతే కాదు హైకోర్టు తీర్పు కోసం చాలా ఎదురు చూశామని, కోర్టు కార్మికులకు న్యాయం చేస్తుందని భావిస్తే ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురయ్యామని పేర్కొన్నాడు. ఇక తన మరణం చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను అని, ఇక సెలవు అని లేఖలో పేర్కొన్నాడు నరేష్. తన కుటుంబంలా మరొక ఆర్టీసీ కార్మిక కుటుంబం ఆవేదన చెందవద్దని కోరుకుంటున్నానని, తన చావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కారణమని, ఇది తాను సొంతంగా రాసిన లేఖ అని సూసైడ్ నోట్ రాశాడు నరేష్.
దసరా, దీపావళి లేదు .. కార్మిక కుటుంబాలకు అన్నం కూడా లేదని ఆవేదన
ఇక అంతే కాదు ఆర్టీసీ సమ్మె వల్ల కార్మిక కుటుంబాలు దసరా చేసుకోలేదని, దీపావళి పండుగకు దూరమయ్యారని ఆవేదన చెందాడు. కొత్త బట్టలు కొనుక్కో లేదని, కనీసం కడుపునిండా తినడానికి అన్నం కూడా లేదు సార్ అంటూ ఆర్టీసీ కార్మిక కుటుంబాల గోడు వెళ్లబోసుకున్నాడు. ఇకనైనా పట్టుదల విడిచి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తానని నమ్ముతున్నానని తన లేఖలో పేర్కొన్నాడు.
ఆర్టీసీ కార్మిక కుటుంబాల కోసం ప్రాణ త్యాగం చేస్తున్నా అని లేఖ
ఇక అంతే కాదు ఆర్టీసీ కార్మికులు మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను కలిసిన సమయంలో జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తనకు బాధ కలిగించిందని తన లేఖలో పేర్కొన్నాడు. నా ఆర్టీసీ కార్మిక కుటుంబాల కోసం నేను ప్రాణత్యాగం చేస్తున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు నరేష్. నా చావుకు బాధ్యత ప్రభుత్వానిదే అంటూ లేఖలో ప్రస్తావించాడు. అంత్యక్రియలకు అశ్వద్ధామ రెడ్డి తప్పకుండా హాజరుకావాలని తన కోరిక గా పేర్కొన్నారు.
తన చావే చివరిది కావాలి.. తన మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని సూసైడ్ నోట్
తన చావు వలన రోడ్డున పడుతున్న తన కుటుంబాన్ని ఆదుకోవాలని అశ్వద్ధామ రెడ్డి కి విన్నవించారు. తన మరణానికి సీఎం కేసీఆర్ తీరే కారణమని రాసిన నరేష్ ఆర్టీసీ కార్మికులు అందరూ బాగుండాలన్నదే తన చివరి కోరిక అని లేఖలో ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను హృదయవిదారక పరిస్థితులనూ వివరిస్తూ, సీఎం కేసీఆర్ మనసు మార్చుకోవాలని, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలలో మరణమృదంగం తన చావుతో ఆగాలని కోరుకున్న నరేష్ రాసిన సూసైడ్ నోట్ ఆర్టీసీ కార్మికుల హృదయాలను కలచివేస్తుంది .