నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్పై గతంలోను...
నల్గొండ: ప్రణయ్ హత్య కేసును సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హత్యకు కారకుడైన మారుతి రావు, శ్రవణ్లను మిర్యాలగూడ బహిష్కరించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమృతను మందకృష్ణతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు.
పరామర్శ అనంతరం మందకృష్ణ మాదిగ, ఎర్రోళ్ల మాట్లాడారు. కుల దురహంకార హత్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రణయ్ హత్యకు నిరసనగా శనివారం మిర్యాలగూడలో బంద్ నిర్వహించారు. ప్రణయ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఉక్రెయిన్లో చదువుతున్న ప్రణయ్ సోదరుడు అజయ్ వచ్చిన అనంతరం ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రి
నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడు అర్థమవుతోంది
తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ల గురించి కూతురు, ప్రణయ్ సతీమణి అమృత మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు, తనకు ఎప్పుడూ ఫోన్ చేయని తండ్రి హత్య జరిగిన సమయంలో ఫోన్ చేశారని, కానీ బహుశా తాను కచ్చితంగా ఎక్కడ ఉన్నానో తెలుసుకునేందుకే ఫోన్ చేశాడని ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు. మా మీద మా వాళ్లు పూర్తి నిఘా పెట్టారని, ఎక్కడికి వెళ్లినా సెకన్ల వ్యవధిలోనే తన తండ్రికి సమాచారం వెళ్లేదని, బంగారం దుకాణం, బ్యూటీ పార్లర్.. ఇలా బయటకు వెళ్లిన ప్రతిసారీ వెంటనే అమ్మ ఫోన్చేసి జాగ్రత్తలు చెప్పేదని, తమపై నిఘా ఉందని తెలుసునని, కానీ ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదని, హత్య జరిగిన రోజు మాత్రం నాన్నే ఫోన్ చేశాడని, తాను ఎత్తలేదని, ప్రణయ్పై దాడి జరిగిన వెంటనే లోపలికి పరుగెత్తి తొలుత నాన్నకే ఫోన్ చేశానని, సరిగా వినిపించడం లేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడని, డీఎస్పీకి ఫోన్ చేస్తే ఆయనా స్పందించలేదని, తర్వాతనే తన మామ బాలస్వామికి ఫోన్ చేసి విషయం చెప్పానని, బహుశా నేను కచ్చితంగా ఎక్కడున్నానో తెలుసుకునేందుకే నాన్న ఫోన్ చేశాడని అర్థమవుతోందన్నారు.
కూతురును తీసుకెళ్లాల్సింది
అమృతను పెళ్లి చేసుకున్నారనే అక్కసుతో మారుతీరావు నా కొడుకును హత్య చేయించాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. ప్రణయ్, అమృత తొమ్మిదో తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధం లేకుండా ఉండేందుకు తాను హామీ ఇచ్చానని, ఇంజినీరింగ్ చదివే సమయంలో మళ్లీ ఇద్దరు మాట్లాడుకున్నారని, మేజర్లు అయ్యాక తమకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పారు. తాను లైఫ్ ఇన్సురెన్స్లో ఉద్యోగం చేస్తుండగా, తనపై అప్పుడు చీటింగ్ కేసు పెట్టించారని, స్టేషన్కు పిలిపించి ఇబ్బందులకు గురిచేశారని, ఆ తర్వాత కేసు ఎత్తేశారని బాలస్వామి తెలిపారు. మారుతీరావు తన కూతురును తీసుకెళ్లి ఉండాల్సిందని, అన్యాయంగా తన కొడుకును హత్య చేయించారన్నారు.
గతంలోను చంపేందుకు ప్రయత్నాలు
మారుతీరావు, శ్రవణ్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత మంచిగా ఉన్నట్లు నటించేవారని చెబుతున్నారు. తరుచూ కూతురుతో ఫోన్లో మాట్లాడేవాడు. అదే సమయంలో మిర్యాలగూడలో పీడీ యాక్ట్ కింద అరెస్టైన ఓ వ్యక్తితోపాటు నల్గొండలోని రౌడీ షీటర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో ప్రణయ్ హత్యకు భారీ మొత్తం ఇస్తానని నల్గొండకు చెందిన కిరాయి హంతకుడితో ఒప్పందం చేసుకున్నాడు. అతడు మిర్యాలగూడలో రెక్కీ నిర్వహించాడు. విషయం తెలియడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండో ప్రయత్నమూ విఫలమైంది.
మూడో ప్రయత్నంలో.. అతనితోనే
ఇప్పుడు మూడో ప్రయత్నంలో చంపేశాడు. భూ వివాదంలో గతంలో తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి సహకారం మారుతిరావు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ కేసు కోర్టులో నడుస్తోంది. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తితోనే కోట్లాది రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
హైస్కూల్ ప్రేమ
ఆగస్ట్లో మిర్యాలగూడలోని ఫంక్షన్ హాల్లో భారీ రిసెప్షన్ జరిగింది. పట్టణానికి చెందిన పెద్దలు హాజరయ్యారు. వెడ్డింగ్ షూట్, రిసెప్షన్లో ప్రణయ్, అమృత దిగిన ఫొటోలు, వీడియోలు పట్టణంలో వైరల్ య్యాయి. ఇది కూడా వారి ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.