నా భర్త ఐఏఎస్ అధికారిణిని పెళ్లాడాడు, పలువుర్ని మోసం చేశాడు: నటి పూజిత
హైదరాబాద్: టాలీవుడ్ నిన్నటి హీరోయిన్, టీవీ సీరియల్ నటి పూజిత తన భర్త విజయ్ గోపాల్ పైన ఆరోపణలు చేశారు. తన భర్త తనను మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. ఏ ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకొని తనను మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. గతంలోను తన భర్త పలువురు మహిళలను మోసం చేశాడని ఆరోపించారు.
తన భర్త వెనుక పలువురు పెద్ద మనుషులు ఉన్నారని ఆరోపిస్తున్నారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. ప్రస్తుతం తన భర్త వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరో తేలాలని ఆమె అంటున్నారు. ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
తనకు ప్రాణహానీ ఉందని పూజిత చెప్పారు. న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుమారుడికి ప్రాణహానీ ఉందని చెప్పారు. తన భర్త తనతో పాటు పలువురు మహిళలను మోసం చేశాడని, ఇప్పుడు ఐఏఎస్ అధికారిణిని పెళ్లాడాడాని చెప్పారు.
ఇదీ విషయం...
నటి పూజిత ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సహా పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు సీరియళ్లలో బిజీగా ఉంది. తన భర్త వియగోపాల్ ఓ ఎంపీ వద్ద పీఏగా పని చేస్తున్నారని ఆమె తెలిపారు. అయితే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు.
తమకు ఓ బాబు కూడా ఉన్నాడని చెప్పారు. పదమూడు సంవత్సరాలు తనతో కాపురం చేసిన తన భర్త తాజాగా ఓ ఐఏఎస్ అధికారిణిని రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. పోలీసులతో తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు.