రైతులకు నా పాదాభివందనాలు, వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు : సీఎం కేసీఆర్
గురువారం రాత్రి ప్రగతి నివేదన సభా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఎండకు భయపడకుండా తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నట్లు చెప్పారు.
వరంగల్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రగతి నివేదన సభకు వచ్చిన రైతులందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గురువారం రాత్రి ప్రగతి నివేదన సభా వేదికగా సీఎం ప్రసంగించారు. ఎండకు భయపడకుండా తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అందరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మూడేళ్ల పరిపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన ఆశయమన్నారు.
రాష్ట్రం ఏర్పడిన వెంటనే విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేశాం. రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు గడవకముందే ఆ సమస్యను అధిగమించామని ఆయన చెప్పారు. కరెంట్ సమస్య అధిగమించడంతో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయని చెప్పారు.
ఆ తర్వాత పరిపాలన దృష్ట్యా జిల్లాల పునర్విభజన చేపట్టామని తెలిపారు. జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువైందన్నారు. పాలన సంస్కరణల కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. దీనిలో భాగంగా గొల్ల, కురుమ, రజక, నాయి బ్రహ్మణ, కుమ్మరితో ఇతర కులాలను ఆదుకుంటున్నామని తెలిపారు. రూ. 40 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.