టెక్కీ సునీత హత్య కేసులో మరో ట్విస్ట్: లైంగిక దాడి జరిగిందా, ఆ రెండు రోజులేమైంది?
టెక్కీ సునీత హత్య కేసు మిస్టరీగానే ఉంది. రెండు రోజుల పాటు ఆమె ఆఫీసుకు వెళ్లలేదని తేలింది. దీంతో ఆ రెండు రోజులు ఏమైందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: టెక్కీ సునీత హత్య కేసు మిస్టరీగానే ఉంది. ఆమె హత్య కేసులో మరో మలుపు కూడా ఉన్నట్లు తెలుస్తోది. సునీతను ఆమె సోదరుడు నర్సింగ్రావు ప్రతి రోజు తన బైకుపై తీసుకుని వెళ్లి సికింద్రాబాద్ బస్టాపులో దింపేవాడు. ఆమె అక్కడి నుంచి బస్సులో అమీర్పేటలోని కార్యాలయానికి వెళ్లేది.
బుధవారం ఉదయం 9 గంటలకు బస్టాపులో ప్రతి రోజు లాగే దింపాడు. అదేరోజు మధ్యాహ్నం ఆమె హైదరాబాదులోని మాదాపూర్లో శవమై కనిపించింది. సునీత పనిచేస్తున్న కంపెనీలో గురువారం పోలీసులు విచారించారు. ఆమె గత రెండు రోజులు ఆఫీసుకు రాలేదని తెలిసింది.
ట్విస్ట్: టెక్కీ సునీత హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా?
దాంతో మంగళవారం వాలంటైన్స్డేకు ఎక్కడికైనా వెళ్లి ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లిన సునీత బుధవారం బయటికి వెళ్లి హత్యకు గురైంది. ఉదయం 9 తర్వాత అదృశ్యమైన సునీత ఒంటిగంట సమయంలో దగ్ధమై ఉండటాన్ని బట్టి ఈ నాలుగు గంటలే దర్యాప్తులో కీలకంగా మారాయి.
మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీ స్థలంలో భద్రత సిబ్బంది బసచేసే గదికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పొదల్లో చిన్నారులు మృతదేహాన్ని గుర్తించి కేకలు వేశారు. భద్రత సిబ్బంది సంతోష్ తివారీ కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. గొంతు నులిమి చంపిన తర్వాత ఆమె శవానికి నిప్పుపెట్టారని అనుకుంటున్నారు.
సునీతను 15 ఏళ్ల కిందట శ్రీనాథ్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేసినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అతనిపై అప్పట్లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సోదరుడు నర్సింగ్రావు తెలిపారు. తర్వాత తనవద్ద పెళ్లి ప్రస్తావన తేవద్దని సునీత చెప్పిందన్నారు. తాజాగా సునీత మెయిల్కు ఇటీవల కొందరు యువకులు అసభ్యకర సందేశాలు పంపినట్లు కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో ప్రేమ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 14, 15 తేదీల్లో ఆమె ఎక్కడెక్కడికి వెళ్లింది? మొబైల్లో ఎవరితో మాట్లాడింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగిందా అన్న విషయం పోస్టుమార్టం నివేదికలో తేలుతుంది.