వీడిన మిస్సింగ్ కేసు మిస్టరీ : హైదరాబాద్ చిన్నారులు క్షేమం
హైదరాబాద్ : నగరంలోని హైదర్ గూడ పరిధిలో నమోదయిన చిన్నారుల మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. చిన్నారులు వైష్ణవి, మాధవిని ఎవరు కిడ్నాప్ చేయలేదని నిర్దారించిన పోలీసులు.. వీరిద్దరు తమ తాతయ్య ఇంటి వద్ద క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ గూడలో ఆరో తరగతి చదువుతోన్న మాధవి, వాచ్ మెన్ వద్ద నుంచి రూ.500 తీసుకుంది. స్కూల్ కి వెళ్లాక మాధవి దగ్గర డబ్బులు కనిపించడంతో, దీనిపై టీచర్ ఆరా తీసింది. డబ్బులు ఎక్కడివని మాధవిని ప్రశ్నించిన టీచర్, ఆమె తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా ఆదేశించింది.
దీంతో భయపడ్డ మాధవి ఇంటికి రాకుండా స్కూల్ నుంచే పారిపోయింది. అయితే మాధవితో పాటు మరో చిన్నారి వైష్ణవి కూడా మిస్ అవడంతో.. చిన్నారుల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు అయింది. మిస్సింగ్ మిస్టరీని చేధించడానికి మొత్తం మూడు బృందాలను రంగంలోకి దించిన పోలీస్ యంత్రాంగం.. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ లో చిన్నారుల కోసం గాలించింది. అలాగే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది.
అయితే చివరాఖరికి చిన్నారులు.. తూర్పు గోదావరిలోని ఐ.పోలవరంలో ఉన్న తమ తాతయ్య ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. విషయాన్ని వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి,చిన్నారుల క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.