విక్రమ్ కాల్పుల మిస్టరీ: చివరిగా కలిసింది అతన్నే, తండ్రిపై ఇలా, సీన్ టూ సీన్ ఇదీ కథ!
తద్వారా కొన్నిరోజులైనా వారు తనను ప్రశ్నించకుండా ఉంటారని ఆలోచించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంలో అసలు మిస్టరీ ఇంకా వీడలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ముఖేష్.. కాల్పుల సెన్సేషన్ ద్వారా అప్పులు ఇచ్చినవాళ్లను భయపెట్టాలనుకున్నాడా?.. తద్వారా కొన్నిరోజులైనా వారు తనను ప్రశ్నించకుండా ఉంటారని ఆలోచించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తండ్రిని బెదిరించేందుకే విక్రమ్ డ్రామా, ఇలా కాల్చుకున్నాడు: అసలేం జరిగింది?
మరోవైపు తండ్రి ముఖేష్ గౌడ్ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోవడంతో.. 'కాల్పుల' ద్వారా ఆత్మహత్యకు యత్నించినట్లు డ్రామా క్రియేట్ చేసి డబ్బులేమైనా రాబట్టాలనుకున్నాడా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్పృహలోనే ఉన్నప్పటికీ విక్రమ్ అసలు నోరు విప్పకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
సినీ కార్యాలయం ఏర్పాటు చేసే పనిలో:
జూబ్లీహిల్స్ రోడ్ నం.86లోని ప్లాట్ నం.459లో విక్రమ్ దంపతులు అద్దెకు దిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పిల్లలతో కలిసి ఇద్దరూ ఇందులోనే నివసిస్తున్నారు. ఇష్క్, గండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన విక్రమ్.. ఇటీవల ప్రొడక్షన్ కార్యాలయం ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Recommended Video
చివరిసారిగా 'చాంద్'ను కలిసి:
గురువారం రాత్రి 7.30గం.కు ఇంటికి వచ్చిన విక్రమ్ .. తిరిగి 9గం.కు మళ్లీ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లుగా ఆయన భార్య షిఫాలీ చెబుతున్నారు. ఫిలింనగర్ రోడ్ నం.1 సమీపంలో ఉండే చాంద్ అనే వ్యక్తిని చివరగా కలిసిన విక్రమ్.. తెల్లవారుజామున 2-2.20గం. ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు.
వచ్చీ రాగానే డూప్లెక్స్ ఇంటి పైభాగంలో నిద్రిస్తున్న భార్యను లేపి.. సమీపంలోని హకీంబాబా దర్గాకు వెళ్లి పేదలకు అన్నం చేయాలని, అందుకోసం రెడీ అవాల్సిందిగా సూచించారు.
డ్రాయింగ్ రూమ్ నుంచి కాల్పులు:
దర్గాకు వెళ్లేందుకు సిద్దమైన విక్రమ్.. 3.20గం. ప్రాంతంలో కిందికి వచ్చి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో ఆయన భార్య షిఫాలీ కిందకు వచ్చేందుకు సిద్దమైంది. ఆమె మెట్లు దిగుతున్న సమయంలోనే.. డ్రాయింగ్ రూమ్ నుంచి కాల్పులు శబ్దం, అరుపులు వినిపించాయి.
దీంతో షిఫాలీ తీవ్ర టెన్షన్ కు గురయ్యారు. వెంటనే డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లి చూడగా.. విక్రమ్ రక్తపు మడుగులో కనిపించారు. ఎవరో వచ్చి తనపై కాల్పులు జరిపారని చెప్పారు. ఆ వెంటనే వాచ్ మెన్ శ్రీనివాస్ తో పాటు డ్రైవర్స్ శ్రీకాంత్, గోపీల సహాయంతో విక్రమ్ ను కారులో చేర్చి అపోలో ఆసుపత్రికి తరలించారు.
కాల్పుల్లో కుడి చేతి భుజంలో దిగిన తూటా బయటకు వచ్చేయగా.. ఎడమ భుజంలో దిగి ఇరుక్కుపోయిన బుల్లెట్ ను వైద్యులు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు.
ఇంటి చుట్టే తిరిగిన శునకం:
ఘటనాస్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లతో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ సందర్భండా పోలీస్ డాగ్ స్క్వాడ్ ముఖేష్ ఇంటి చుట్టే తిరిగింది. ఒకసారి గేటు బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిందని చెబుతున్నారు. డ్రాయింగ్ రూమ్ లో రెండు ఖాళీ తూటాలు(ఖాళీ క్యాట్రిడ్జ్), విక్రమ్ కుడి భుజం నుంచి బయటకు వచ్చిన మరో తూటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటనాస్థలంలో ఉన్న రక్తపు మరకలను వాచ్ మెన్ శ్రీనివాస్ కొంతమేర తుడిచేయగా.. ఆయన కుమారుడు నాగేంద్ర అడ్డుకున్నట్లు చెబుతున్నారు. సోఫా, ఫ్లోర్ పై పడిన రక్తపు మరకల నుంచి పోలీసులు నమూనాలు సేకరించారు. కాల్పులకు వాడింది పిస్టల్ గా భావిస్తున్నారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ను పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావులు ఎంత ప్రశ్నించినా లాభం లేకపోయింది. తనపై కాల్పులు జరిపినవారి గురించి బయటకు వచ్చాకే చెబుతానని అంటున్నారు. కేసు దర్యాప్తు కోసం పది బృందాలు ఏర్పాటు చేసినట్లు మహేందర్రెడ్డి తెలిపారు.
ఫోరెన్సిక్ సందేహాలు..
షిఫాలీ ఇచ్చిన ఫిర్యాదు, వాచ్ మెన్ చెబుతున్న విషయాలు.. విక్రమ్ గాయాలను పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. వీరి మాటల్లో నిజమెంత అన్నది వారు తేల్చుకోలేకపోతున్నారు.
కాగా, ఇటీవల తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్.. ఇటీవలే ఓ స్టూడియో ఏర్పాటు చేయగా.. దాని ద్వారా రూ.1.5కోట్ల నష్టాలు మిగిలాయని పోలీసులు చెబుతున్నారు. ఆయన ఫోన్ లోను అప్పుల వాళ్ల మెసేజ్ లే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆర్థిక ఒత్తిళ్లకు సంబంధించి 35వరకు సందేశాలను విక్రమ్ ఫోన్ లో పోలీసులు గుర్తించారు.
ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లోను విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. తండ్రి నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని స్నేహితులతో విక్రమ్ చెప్పినట్లుగా పోలీసులకు తెలియవచ్చింది. కాల్పులకు ఉపయోగించిన పిస్తోలు గురించి పోలీసులు దాదాపు 6గం. పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా.. దాని ఆచూకీ దొరకలేదు. ఇటీవల రద్దయిన తన ఆయుధ లైసెన్స్ ను పునరుద్దరించుకోవడానికి విక్రమ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.