పవన్ కళ్యాణ్, జగన్ నుంచి చంద్రబాబు వరకు ఎవర్నీ వదలని నాగబాబు!?
నాగబాబు నోట్ల రద్దు పైన వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ విమర్శలు పవన్ నుంచి జగన్, చంద్రబాబు వరకు అందరికీ వర్తిస్తాయని అంటున్నారు.
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు నోట్ల రద్దు అంశంపై స్పందించారు. ఈ విషయంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. మోడీని దమ్మున్న మగాడని, డెబ్బై ఏళ్ల తర్వాత అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే ప్రధాని కనిపించారన్నారు.
అదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడినని, కానీ మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రశంసించాలని వ్యాఖ్యానించారు. మొత్తానికి నాగబాబు వీడియో వైరల్ అయింది. అదే సమయంలో ఆయన తన వ్యాఖ్యలతో పలువురికి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.
తన సోదరుడు చిరంజీవి ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు, సోదరుడు పవన్ కళ్యాణ్కు కూడా పరోక్షంగా ఆయన చురకలు వేసినట్లుగా ఉందని అంటున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు, ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చినట్లుగా ఉందని చెబుతున్నారు.
నాగబాబు నోట్ల రద్దు పైన వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆ విమర్శలు చేసిన వారిలో పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు కూడా ఉన్నందున, అవి వారికి కూడా పరోక్షంగా కౌంటర్ పడినట్లయిందని అంటున్నారు.
చంద్రబాబుకు, మరికొందరికి లీక్ అయిందని కొందరు విమర్శలు చేస్తున్నారని, కానీ ముందే అంబానీ, అదానీలకు లీక్ చేస్తే వారి నుంచి ఎప్పుడో అందరికి చేరిపోయేదని, అలా జరగలేదని, మోడీ ప్రకటనలో తనకు నిజాయితీ కనిపించిందని చెప్పారు. చంద్రబాబు, అదానీ, అంబానీలకు ముందే లీక్ అయిందని వైసిపి నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాతే మోడీకి ఎదురు తిరిగారు!: ఒక్కటైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు
ఇక, రూ.2000 నోటు తీసుకు రావడాన్ని కూడా విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నోటు పైన చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. కానీ, ప్రజల ఇబ్బందులపై ముందస్తుగా అంచనా వేయలేదని, జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.
నోట్ల రద్దు నేపథ్యంలో బాధితుల్లో తాను కూడా ఉన్నానని, ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట నిజమని, కానీ బ్లాక్ మనీ గురించి ముందే చెబితే ఎక్కడి వారు అక్కడ ముందే సర్దేసుకునే వారని, అలాంటప్పుడు దానికి ఫలితం లేకుండా పోయేదని అభిప్రాయపడ్డారు.