ఒంటికాలిపై లేచిన నాగబాబు.. పనికిమాలినవాడంటూ ప్రకాష్ రాజ్పై నిప్పులు.. గట్టి వార్నింగ్...
జీహెచ్ఎంసీ ఎన్నికల హీట్ సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. పోటీకి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్పై కూడా వాడి వేడి చర్చలు,పదునైన విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ రాజకీయం 'ఊసరవెళ్లి'ని తలపిస్తోందని నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మరో నటుడు,పవన్ సోదరుడు నాగబాబుకు మంట పుట్టించాయి. ప్రతీ పనికిమాలినవాడు పవన్ కల్యాణ్ను విమర్శించడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు,ప్రకాష్ రాజ్ సినీ జీవితంపై కూడా పలు విమర్శలు గుప్పించారు.
నాగబాబు ఏమన్నారు...
'రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశం లాంగ్ టర్మ్లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. ప్రశాష్ రాజ్ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మస్వామి డిబేట్లోనే అర్థం అయ్యింది. నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది.' అని నాగబాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
డైరెక్టర్స్ను హింసించావంటూ...
'నీ ఉద్దేశంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరు. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంతో హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా తయారై.. అప్పుడు పవన్ కల్యాణ్ అనే నిస్వార్థ నాయకుడిని విమర్శించు.' అని నాగబాబు ప్రకాష్ రాజ్పై నిప్పులు చెరిగారు.
ఒళ్లు పొంగి.. నాగబాబు వార్నింగ్
'డైరెక్టర్స్ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడటం ఏమి తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని నీవు నోటికొచ్చినట్లు విమర్శించినా... నిన్నెవరూ ఏమీ అనలేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. బీజేపీ,జనసేన కచ్చితంగా జీహెచ్ఎంసీలో సత్తా చాటబోతున్నాయి. మీడియా అడిగిందని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటపెట్టుకోకు.' అని నాగబాబు ఘాటుగా హెచ్చరించారు.
ప్రకాష్ రాజ్ ఏమన్నారు..
పవన్కల్యాణ్ స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని... రాజకీయాల్లో ఊసరవెళ్లిలా మారిపోయారని ప్రకాష్ రాజ్ విమర్శించారు. 'పవన్ కల్యాణ్ అందరినీ నిరాశపరిచింది. ఈ విషయం చెప్తున్నందుకు క్షమించండి. తాను లీడర్ను కాదన్నట్లుగా పవన్ తనకు తాను అనుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎంత ఓటింగ్ వచ్చిందో తెలియదా..? 2014లో ఎన్డీయేకి మద్దతు తెలిపి మోదీని గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. కానీ 2019లో ఆ మాటలు పక్కన పెట్టి లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో మోదీ, టీడీపీని విమర్శించారు. 2020 లో మళ్లీ బీజేపీతో కలిపి ముందుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ ఓ ఊసరవెళ్లి తప్ప మరొకటి కాదు.' అని ప్రకాష్ రాజ్ విమర్శించారు. ప్రకాష్ వ్యాఖ్యలకు నాగబాబు నుంచి తీవ్ర స్పందన రావడంతో.. ఈ ఇద్దరు నటుల మధ్య మున్ముందు మాటల యుద్దం నడిచే అవకాశం లేకపోలేదు.
Recommended Video
ప్రకాష్ రాజ్ కి నా ans pic.twitter.com/Nu3WKdqMzr
— Naga Babu Konidela (@NagaBabuOffl) November 27, 2020