కాంగ్రెస్లోకి నాగం, ఆదిశ్రీనివాస్, గద్దర్ తనయుడు సూర్య: రేపే ముహూర్తం
హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నాయకుల చేరికలపై దృష్టి పెట్టింది. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్సిగ్న్ల్ ఇచ్చింది.
ఇది ఇలాఉండగా, ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ తనయుడు సూర్య, వ్యాపారవేత్త ఆది శ్రీనివాస్ కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాయలంలో బుధవారం ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో వీరు పార్టీలో చేరనున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి.. రాహుల్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
ప్రజాగాయకుడు గద్దర్.. తెలంగాణ ఉద్యమాల్లో తన ఆట-పాటలతో, ధూంధాంలతో ఎంతో ఉత్తేజాన్ని కలిగించించిన విషయ తెలిసిందే. ఆయన తనయుడు సూర్య కాంగ్రెస్లో చేరడం కొత్త ఉత్సాహం నింపుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే, సీఎం కేసీఆర్పై విరుచుకుపడే నాగం జనార్దన్రెడ్డితోపాటు బీజేపీకి చెందిన మరో నాయకుడు ఆది శ్రీనివాస్కు కూడా కాంగ్రెస్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కాంగ్రెస్లో చేరనున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ బీజేపీకి గుడ్బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, పార్టీలో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. కాగా, ఇటు నాగం, అటు ఆది శ్రీనివాస్ చేరికపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.