నీదెంత, ఆంధ్రావాళ్ల వాటా ఎంత: కేసీఆర్పై నాగం తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పైన బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి గురువారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ ఎర్రవెల్లికి సర్పంచా లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రా అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెట్టడానికి తాను రెడీగా ఉన్నానని చెప్పారు.
ప్రాజెక్టుల మధ్య నిద్రపోతానని నాడు చెప్పిన కేసీఆర్, ప్రాజెక్టులు అంచనాలను పెంచి నేడు అవినీతిని తారస్థాయికి పెంచేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు మద్దతు ఇచ్చిన పార్టీలను సీఎం కేసీఆర్ మరిచిపోయారన్నారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ పేర్లను కేసీఆర్ ప్రస్తావించకపోవడంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ, ఇతర పార్టీల మద్దతు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?అన్నారు.
కేవలం తన కుటుంబం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల సమావేశాలకు అనుమతించకపోవడం దారుణమన్నారు.
ఇతర రాజకీయపార్టీలను అణగతొక్కడమే కాకుండా, పత్రికా స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్నారన్నారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రులకు పని ఎక్కడుందన్నారు. ఆయన ప్రభుత్వంలో ఆంధ్రా పెత్తనమే నడుస్తోందన్నారు. ఇంత అవినీతి గత ప్రభుత్వాల కాలంలో లేదన్నారు.
ప్రాజెక్టుల అంచనాలు ఇష్టం వచ్చినట్లు పెంచడం సరికాదన్నారు.య ప్రజలే నీకు ప్రతిపక్షం అన్నారు. 2019లో మేం (బీజేపీ) ప్రజల ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు. తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు కేసీఆర్కు నీతి లేదన్నారు. వారి కుటుంబాలని బీజేపీ ఆదుకుందని చెప్పారు.
రాష్ట్రంలో కరువుకు కేంద్రం మంజూరు చేసిన నిధులు ఖర్చు చేయాలన్నారు. కేసీఆర్ అడగక ముందే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.42వేల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేశారని చెప్పారు. నిధుల మంజూరులో నీ పోరాటం ఏముందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులకు బడ్జెట్లో పెట్టింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, కాంట్రాక్టులు నీ కార్యాలయంలోనే రింగ్ చేసినవని ధ్వజమెత్తారు. అందులో నీ వాటా, ఆంధ్రా కాంట్రాక్టర్ల వాటా ఎంత అన్నారు.