ప్రజలు మేల్కోవాలి: వైఎస్ జగన్తో కేసీఆర్ కుమ్మక్కంటూ నాగం, రావుల ఫైర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ సామర్థ్యం పెంపు- తెలంగాణపై ప్రభావం అనే అంశంపై ప్రెస్క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్, సీపీఐ నేత బాల మల్లేశం, రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ, తదితరుల హాజరయ్యారు.
జగన్తో కేసీఆర్ కుమ్మక్కు..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నీటిని తీసుకెళ్తామని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినా.. కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదని విమర్శించారు. మొత్తం 1.2లక్షల క్యూసెక్కుల నీటిని ఏపీ తీసుకెళ్లాలని చూస్తోందని అన్నారు.
తండ్రీకొడుకులే తెలంగాణ తెచ్చినట్లు..
తండ్రీకొడుకులే తెలంగాణ తీసుకొచ్చినట్లు కేసీఆర్, కేటీఆర్ చెప్పుకుంటున్నారని నాగం జనార్ధన్ విమర్శించారు. 1969లోనే తెలంగాణ కోసం ఉద్యమించామని, ఈటల రాజేందర్ లాంటి నేతలు కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారని నాగం గుర్తు చేశారు. కాగా, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణలోని పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ శనివారం నాగం లేఖ రాసిన విషయం తెలిసిందే. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు.
ప్రజలు మేల్కోవాలి..
ఇది ఇలావుంటే, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీని సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ఏపీకి నీరివ్వాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ. 10వేల కోట్లు వృథా చేసి.. ఇప్పుడు ప్రాణహిత అంటున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో 34 టీఎంసీలు మాత్రమే తీసుకెళ్లే హక్కు ఏపీకి ఉందని.. కానీ ఏపీ అదనంగా 100 టీఎంసీలు తీసుకెళ్తోందని రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేల్కోవాలని అన్నారు.