మూగజీవాలు: తెలంగాణ మంత్రులపై నాగం సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు మూగ జీవాలతో సమానమని బిజెపి తెలంగాణ నేత నాగం జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేపటి నుంచి చేపట్టనున్న రైతు భరోసా యాత్రకు సంబంధించిన విషయాలను ఆయన మంగళవారంనాడు మీడియాకు వివరించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులంతా డమ్మీలుగా మారారని చెప్పారు. ప్రశ్నిస్తే జైల్లో పెడతామని మంత్రి తలసాని చెప్పడం సిగ్గుచేటని నాగం అన్నారు. ప్రభుత్వ పాలనను తాను ప్రశ్నిస్తున్నానని, దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని సవాల్ చేశారు.
మంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నాగం హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలనపై దృష్టి కేంద్రీకరిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం పాలనను గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ను చూస్తే తెలంగాణ ప్రజలకు సిగ్గనిపిస్తోందని నాగం జనార్దన్ విమర్శించారు.
పోరాటాలు కొత్త కాదు..
కాగా, తెలంగాణకూ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు శ్రీనివాస గౌడ్ డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే ఉద్యమం చేపడుతామని, పోరాటాలు తమకు కొత్త కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తమకు అన్యాయం జరిగితే సహించబోమని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీపై రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.