'కంటోన్మెంట్'పై నాగం: టీడీపీవల్లే బీజేపీ నష్టపోయిందా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంటెన్మెంట్ ఎన్నికల ఫలితాల పైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం స్పందించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని వ్యాఖ్యానించారు. తద్వారా టీడీపీతో పొత్తు వల్లే తాము నష్టపోయామని అభిప్రాయపడ్డారు.
కాగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాజధాని పరిధిలో జరిగిన తొలి ఎన్నికలో తెరాస విజయకేతనం ఎగరేసింది. కంటోన్మెంట్ బోర్డు తెరాస వశమైంది. తెలంగాణలో అధికార పార్టీ అయినప్పటికీ టీఆర్ఎస్కు మహానగరంలో అంతగా పట్టులేదన్న అంచనాలు తలకిందులయ్యాయి.
కంటోన్మెంట్లో ఎనిమిది స్థానాలకుగాను నాలుగు తెరాస మద్దతుదారులు సొంతం చేసుకుంది. మరో రెండు స్థానాల్లో తెరాస తిరుగుబాటు అభ్యర్థులే నెగ్గారు. వారిద్దరు తాము తెరాసలోనే కొనసాగుతామన్నారు. ఒక వార్డులో కాంగ్రెస్, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ-బీజేపీ కూటమి ఖాతా తెరవలేదు.
మాజీ ఎంపీ సత్యనారాయణ కుమార్తె సుహాసిని, కుమారుడు నవనీత్ ఇద్దరికీ పరాజయమే ఎదురైంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న (టీడీపీ) కుమార్తె లాస్యనందిత కూడా ఓడిపోయారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమీప బంధువు రాజేశ్కూ చుక్కెదురైంది.
పలుమార్లు బోర్డు సభ్యుడిగా ఎన్నికై ఇటీవల కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జంపన ప్రతాప్, ఆయన భార్య విద్యావతి ఇద్దరూ ఓడిపోయారు. వీరిపై తెరాస రెబల్స్ గెలుపొందారు. కంటోన్మెంట్ బోర్డుకు ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్లను లెక్కించారు. 1.6 లక్షల మంది ఓటర్లతో పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటిదాకా పెద్ద ప్రాధాన్యం లభించలేదు. ఈసారి మాత్రం తెరాస దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.