Nagarjuna Sagar ఉపఎన్నిక: బరిలో మెగాస్టార్ బంధువు.. కేసీఆర్ పక్కా స్కెచ్..వర్కౌట్ అవుతుందా..?
నాగార్జున సాగర్: దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్యంగా ఘనవిజయం సాధించడంతో కళ్లన్నీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికపై పడింది. ఈ బైపోల్లో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇది కూడా గెలిచి టీఆర్ఎస్ పార్టీకి ఇక కాలం చెల్లినట్లే అని నిరూపించే ప్రయత్నంలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో కూడా మ్యాజిక్ చేసిన కమలం పార్టీ... తాజాగా నాగార్జున సాగర్ ఉపఎన్నికపై దృష్టిసారించింది. అదే సమయంలో గులాబీ పార్టీ కూడా కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి ఆ ఛాన్స్ ఇతర పార్టీకి ఇవ్వకూడదని గట్టిగా డిసైడైన నేపథ్యంలో... మెగా కాంపౌండ్ నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తోంది. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు..?
దుబ్బాక షాక్తో జాగ్రత్తగా ఉన్న గులాబీ పార్టీ
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతినడం ఆ పై గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతో డీలాపడ్డ టీఆర్ఎస్... నాగార్జునసాగర్ ఉపఎన్నికతో తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. దుబ్బాకలో కూడా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఉపఎన్నిక వచ్చింది. అయితే ఆ సమయంలో సానుభూతి పవనాలు కలిసివస్తాయని గులాబీ దళం భావించినప్పటికీ ప్రజలు అనూహ్య రీతిలో కమలం పార్టీని గెలిపించారు. దీంతో షాక్ తిన్న టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించకూడదని భావించి చెమటోడ్చుతోంది.
జానారెడ్డిని ఎదుర్కొనే సత్తా భరత్కు ఉందా..?
నాగార్జునసాగర్లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డికి మంచి పట్టుంది. ఈ సారి తనే అక్కడి నుంచి మళ్లీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా మంచి అభ్యర్థిని అక్కడ నిలపాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీకి పెద్దగా ఓటర్ బేస్ లేనప్పటికీ మరోసారి దుబ్బాక మంత్రంను నాగార్జునసాగర్లో కూడా వేసి ఆ సీటును దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భరత్కు నాగార్జున సీటు ఇవ్వాలని ముందుగా భావించిన గులాబీ పార్టీ... ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. తన తండ్రిపై ఉన్న సానుకూలత భరత్ వైపు మల్లే అవకాశాలు ఉండటంతో పాటు... అదనపు బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గం తనకే టికెట్ ఇవ్వాలని తీర్మానం చేసింది. అంతేకాదు నోముల నర్సింహయ్య కమ్యూనిస్టు పార్టీలో కూడా ఉన్నందున ఆ పార్టీ మద్దతు కూడా భరత్కు లభించే అవకాశాలున్నట్లు సమాచారం.
మెగా కాంపౌండ్ నుంచి అభ్యర్థి
తాజాగా నాగార్జున సాగర్ టికెట్ నోముల నర్సింహయ్య కుమారుడు భరత్కు ఇవ్వకూడదని సీఎం కేసీఆర్ డిసైడ్ అయినట్లు ప్రగతిభవన్ సమాచారం. ఇటు పాపులారిటీ ప్రకారంగా, అటు ఆర్థికంగా కూడా జానారెడ్డికి భరత్ సరితూగలేడని సీఎం కేసీఆర్ భావించినట్లు సమాచారం. అంతేకాదు దుబ్బాక ఉపఎన్నికలో రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇచ్చి తప్పు చేశామన్న భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, మళ్లీ అదే తప్పును ఈ సారి నాగార్జునసాగర్ ఉపఎన్నికలో రిపీట్ చేయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి బంధవు, అల్లు అర్జున్కు స్వయానా మామ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరును నాగార్జున సాగర్ ఉపఎన్నికకు పరిశీలిస్తున్నట్లు ప్రగతిభవన్ నుంచి లీకులు వస్తున్నాయి.
నాగార్జున సాగర్ చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం
చంద్రశేఖర్ రెడ్డికి పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆయనొక పారిశ్రామికవేత్త. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.ఆ సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. అనంతరం మంచిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక అసలు విషయానికొస్తే నాగార్జునసాగర్ చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం. ఈ విషయం ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కంచర్ల కుటుంబానికి మంచి పాపులారిటీ కూడా ఉందని తెలుస్తోంది. నకిరేకల్కు చెందిన నోముల నర్సింహయ్య కుమారుడు భరత్ కంటే నాగార్జున సాగర్కు చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మంచి ఛాయిస్ అని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.