ఆవిర్భావ వేడుకలు: జాతీయ జెండాకు సెల్యూట్ చేయని కలెక్టర్, వివరణ ఇలా..
నాగర్కర్నూలు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన జెండా ఆవిష్కరణ సమయంలో జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్ జెండాకు సెల్యూట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మంత్రితోపాటు ఎస్పీ కలేశ్వర్ సింగెనవర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజులు జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతం ఆలపించారు. వీరితోపాటే ఉన్న కలెక్టర్ మాత్రం జెండాకు సెల్యూట్ చేయలేదు. గతంలో జనవరి 26 గణతంత్ర వేడుకల్లోనూ కలెక్టర్ ఇలాగే వ్యవహరించినట్లు తెలిసింది.
కాగా, ఆ తర్వాత జెండాకు సెల్యూట్ చేయకపోవడంపై కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ.. జాతీయ జెండా అంటే తనకు గౌరవముందని, సెల్యూట్ చేయాలన్న నిబంధనేమీ లేదని చెప్పారు. అటెన్షన్ లో నిలబడితే సరిపోతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తనకు శిక్షణ సమయంలో చెప్పారని, అదే పాటిస్తున్నానని తెలిపారు. యూనిఫాంలో ఉన్న పోలీస్ సిబ్బంది, త్రివిధ దళాలు మాత్రం తప్పక సెల్యూట్ చేయాల్సి ఉంటుందని, తమకు అవసరం లేదని అన్నారు.
వేడుక అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలుచేస్తూ మానవతావాదిగా పేరుతెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా ఏర్పడిన జిల్లాలను అభివృద్ధి బాట పట్టించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని వివరించారు.
దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారనుందని ఇటీవల కాగ్ ఇచ్చిన నివేదికే కేసీఆర్ పనితీరుకు నిదర్శమన్నారు. రాష్ట్ర మూడో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు మెరుగైన పాలన, నాణ్యమైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వం మరింత అంకితభావం, బాధ్యతతో ముందుకు సాగుతుందన్నారు.