ఏకగ్రీవంలో 10 లక్షలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. త్రిసభ్య కమిటీ విచారణ
నాగర్కర్నూల్ : పరిషత్ ఎన్నికల ఏకగ్రీవం టీఆర్ఎస్ కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత ఎన్నికల్లో 28 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నా.. ఒక్కచోట మాత్రం వివాదస్పదమైంది. టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి తనకు 10 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఆరోపణలు చర్చానీయాంశంగా మారాయి. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో గులాబీ నేతలను విచారించడానికి త్రిసభ్య కమిటీని నియమించింది.
బఫూన్ పిలిస్తే వెళ్లాలా?.. నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ Vs వీహెచ్
10 లక్షల కథ.. ఈసీకి ఫిర్యాదు
నాగర్కర్నూల్ జిల్లాలోని గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానం వివాదస్పదమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు ఇతర అభ్యర్థులందరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈశ్వర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఉపసంహరణ మరుసటి రోజు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారు. తనకు 10 లక్షల రూపాయలు ఇచ్చి పోటీ నుంచి తప్పుకొమ్మన్నారని.. లేదంటే చంపేస్తామంటూ బెదిరించారనేది ఆయన వెర్షన్. ఆ మేరకు జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
త్రిసభ్య కమిటీ విచారణ
కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ రెడ్డి ఫిర్యాదుతో.. ఎన్నికల సంఘం త్రిసభ్య కమిటీని నియమించింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్, వనపర్తి ఎస్పీ అపూర్వ రావు, జిల్లా ప్రాదేశిక ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ పౌసమి బసుతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. మొత్తం ఏడుగురు వ్యక్తులను కమిటీ విచారించింది. ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి వెంకట్ రెడ్డి, ఆయన సతీమణి విజయతో పాటు టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి, రమేశ్ గౌడ్, కేశవ్ గౌడ్, ఆనందం గౌడ్, జంగారెడ్డిని అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు.
ఈసీకి నివేదిక..!
త్రిసభ్య కమిటీ విచారణ మొత్తం వీడియో చిత్రీకరణతో సాగింది. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థికి 10 లక్షల రూపాయలు ఎందుకిచ్చారు, ఎవరి ద్వారా పంపారు, ఆయనను ఇతర ప్రాంతానికి తీసుకెళ్లారా లాంటి ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించారు. నామినేషన్ల ఉపసంహరణ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలతో పాటు ఆ ఏడుగురు చెప్పిన వివరాలను రికార్డు చేశారు. త్రిసభ్య కమిటీ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు పంపించనున్నట్లు సమాచారం.