మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆకుల లలిత, సినీ నటి నగ్మా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఆకుల లలిత అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ జాతీయ కార్యవర్గాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. కార్యవర్గంలోని పేర్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ అధికారికంగా ప్రకటించారు.
ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున విస్తృత ప్రచారం చేసిన సినీ నటి నగ్మా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కార్యవర్గంలో మొత్తం 11 మంది ప్రధాన కార్యదర్శులు, 9మంది కార్యదర్శులు, నలుగురు ఎన్జీవో సమన్వయకర్తలు, ఒక ఐటీ ఇన్ఛార్జి ఉన్నారు.
శోభా ఓజా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగాను, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
కరీంనగర్లో వివాహిత కిడ్నాప్
మతాంతర వివాహం చేసుకున్నదనే కోపంతో ఓ యువతి కిడ్నాప్కు గురైంది. ఈ సంఘటన కరీంగనర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని పెందుర్తి మండలం, తణుగులకు చెందిన అజీజ్, కతలింగం ప్రాంతానికి చెందిన దీపిక మార్చి 28న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు అజీజ్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసి దీపికను కారులో ఎత్తుకు వెళ్లారు. దీంతో తమ వివాహానికి ఒప్పుకోని దీపిక తల్లిదండ్రులే కిడ్నాప్ చేయించారని అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నలుగురు వ్యక్తులు కారులో వచ్చి దీపికను కిడ్నాప్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పెందుర్తి ఎస్ఐ కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.