గొర్రెల్లా కొనడం కాదు.. జగన్ను చూసి నేర్చుకోండి.. కేసీఆర్కు కోమటిరెడ్డి చురకలు
Recommended Video
నల్గొండ : మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తడబడిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలు గెలిచి కాస్తా పుంజుకున్నట్లైంది. ఆ క్రమంలో హస్తం నేతలు క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా అస్త్రశస్త్రాలు ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు.
కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కిస్తూ టీఆర్ఎస్ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం అనే మాట వినపడకుండా చేశారు. ఈ క్రమంలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
కేసీఆర్ తప్పు చేస్తున్నారు.. కాంగ్రెస్ నేతల గుర్రు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేస్తున్నారని పదేపదే ఆరోపిస్తున్నారు హస్తం గుర్తు నేతలు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడం.. కారులోకి ఎక్కించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రతిపక్షం పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం చూసి సీఎం కేసీఆర్ తీరులో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం మూర్ఖత్వం తప్ప.. మంచి పరిణామం కాదని మండిపడుతున్నారు.
బాబూ లోకేశూ.. ఓసారి ఆ ఇంటర్వ్యూలకు వెళ్లి రా.. విజయసాయి సెటైర్లు
ఆ విధానం సరికాదు.. జగన్ను చూసి నేర్చుకోండి
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్షం విషయంలో ఆయన తీరు మరీ దారుణంగా ఉందని ఆరోపణాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్లు కొంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు నల్గొండలో జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కేసీఆర్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చురకలు అంటించారు. అక్కడ జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకవేళ తమ పార్టీలోకి రావాలనుకుంటే.. రాజీనామా చేసి రావాలని.. తద్వారా వైసీపీ గుర్తు మీద పోటీచేసి గెలవాలనే కండిషన్ పెట్టారన్న విషయాన్ని ప్రస్తావించారు. జగన్ను చూసి కేసీఆర్ ఫాలో కావాలని హితవు పలికారు.
ప్రతిపక్షం విషయంలో జగన్ తీరే సెపరేటు..!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం విషయంలో హుందాగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుందన్నారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ధోరణిలో తనకు కొందరు సూచనలు చేసినా.. వాటిని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.
టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలుండగా.. అందులో ఓ ఐదుగురిని లాగేస్తే సభలో అపొజిషన్ లేకుండా చేయొచ్చనే ప్రతిపాదనలను తిరస్కరించినట్లు చెప్పారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశం తనకు లేదని.. ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేయించాలి.. లేదంటే అనర్హత వేటు పడేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుని అలాంటి తప్పులు చేయకుండా మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.