9 నెలల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష.. నల్గొండ హాజీపూర్ కేసుపై ఉత్కంఠ..!
నల్గొండ : అభం శుభం తెలియని 9 నెలల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారం చేసి హతమార్చిన కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్కు వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. న్యాయస్థానం తీర్పుతో రాష్ట్రమంతటా హర్షం వ్యక్తమైంది. సదరు నేరస్థుడు ఘాతుకానికి పాల్పడ్డ ఘటన వెలుగుచూసినప్పుడే వాడికి ఉరే సరైన శిక్ష అనే కామెంట్లు వినిపించాయి. అదలావుంటే ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు దర్యాప్తు పూర్తి చేసి ఉరిశిక్ష ఖరారు చేయడం కొసమెరుపు.
అదలావుంటే నల్గొండ జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన సైకో శ్రీనివాస్ రెడ్డి సీరియల్ కిల్లర్గా మారడం అప్పట్లో సంచలనమైంది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన ఘటనలో ఇటీవలే నిందితుడిపై పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. అయితే వరంగల్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో అక్కడి కోర్టు సత్వరం స్పందించి నిందితుడు ప్రవీణ్ కుమార్కు ఉరిశిక్ష వేయడం స్వాగతిస్తున్నామని.. అదే క్రమంలో తమ ఊరి పిల్లల ఉసురు తీసుకున్న సైకో శీనుగాడి విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తుండటం హాట్ టాపికయింది.
వరంగల్ కోర్టు తీర్పుతో..!
నల్గొండ జిల్లాలో సీరియల్ కిల్లర్ సైకో శ్రీనివాస్ రెడ్డి దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. సైలెంట్గా ఉంటూ ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపిన సైకో శీనుగాడి వ్యవహారం అప్పట్లో దుమారం రేపింది. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ పేరిట ముగ్గురు బాలికలను నమ్మించి పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్లి రేప్ చేసి చంపేశాడు. మళ్లీ ఎప్పటిలాగే గ్రామంలోకి వచ్చి ఏమీ తెలియనట్లు నటించేవాడు.
హన్మకొండలో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు అత్యాచారం చేసి దారుణంగా చంపిన ఘటనలో వరంగల్ అడిషనల్ కోర్టు వాడికి ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఆ క్రమంలో న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దాంతో హాజీపూర్ గ్రామస్తులు మాకు న్యాయం చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు. హన్మకొండ చిన్నారి కేసును యాభై రోజుల్లో తేల్చేశారని.. హాజీపూర్ కేసులో నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోతున్నారు.
సీఎం కేసీఆర్ చెప్పింది ఇలా అర్థమైందా.. మొక్కలు నాటమంటే ఏం చేశారో తెలుసా..! (వీడియో)
మా పిల్లల ఉసురు తీసినోడికి ఉరిశిక్షే సరి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలపై అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి ఆ తర్వాత వారిని హత్య చేశాడు. వారిని పాడుబడ్డ బావిలో పడేసి మళ్లీ ఏమి తెలియనట్లుగా గ్రామస్తులతో కలివిడిగా తిరిగాడు. ఏ మాత్రం తనమీద అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఏప్రిల్ నెలలో పాముల శ్రావణి హత్యోదంతంతో సైకో శీనుగాడి లీలలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆ కేసులో వాడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తే మనీషా, కల్పన అనే మరో ఇద్దరు బాలికలను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.
ఆ క్రమంలో వరంగల్లో 9నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి హత్య చేసిన ప్రవీణ్ కుమార్కు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించడంతో మరోసారి హజీపూర్ ఘటన తెరపైకి వచ్చింది. తమ పిల్లల ఉసురు తీసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలుకోరుతున్నారు.
90 రోజుల్లో ఛార్జ్ షీట్ ఓకే.. మరి న్యాయం జరిగేదెలా?
వరంగల్ కోర్టులో తీర్పు వచ్చినంత తొందరగా హజీపూర్ కేసులో ఎందుకు రావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది.
అపహరణ, లైంగికదాడి, హత్యలు లాంటి కేసుల్లో సత్వరమే తీర్పు ఇవ్వాలని హాజీపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. నిందితుడు శ్రీనివాస్రెడ్డికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ చిన్నారి కేసులో న్యాయం జరిగిందని, అలాగే శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష వేస్తే ప్రజలకు మనోధైర్యం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు కోర్టుల మీద విశ్వాసం పెరగాలంటే.. ఆడపిల్లలు, మహిళల పట్ల దారుణ ఘటనలకు పాల్పడేవారిని ఉరితీయాలని కోరారు.
హరీశ్ రావు కొత్త స్కెచ్.. ఆ ఇలాకాలో అలా.. అక్కడే ఎక్కువగా ఎందుకో తెలుసా?
కోర్టు తీర్పుపై ఉత్కంఠ
హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రాన్ని కుదిపేసింది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి పాశవికంగా చంపిన ఘటనలో పోలీసులు 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నిందితుడికి ఉరిశిక్ష పడుతుందా లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారా అనే కోణంలో ఉత్కంఠ నెలకొంది. సైకో శీనుగాడి దురాగతాలపై హాజీపూర్ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని.. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం.. సెప్టెంబర్ నెల మొదటివారంలో కోర్టులో మరోసారి విచారణ జరగనుండటంతో సైకో శీనుగాడికి ఉరిశిక్ష వేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.