గులాబీ ఎమ్మెల్యేలకు సొంత గూటిలో విలువ లేదంటూ.. టీఆర్ఎస్ పార్టీపై కోమటిరెడ్డి గరం..!
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ విధానాలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. గులాబీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీలోనే విలువ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం వరకు ఉన్న దళిత వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోమటిరెడ్డి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు ఎలాంటి పదవులు వద్దన్న మహానుభావుడు బాపూజీ అని కితాబిచ్చారు. తెలంగాణ సాధన కోసం మొదటిసారిగా ఉద్యమం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.
తెలంగాణకు అరుదైన గౌరవం.. టూరిజంలో రెండు అవార్డులు
ఈ సందర్భంగా హుజుర్నగర్ బై పోల్స్ గురించి ప్రస్తావించిన కోమటిరెడ్డి.. అక్కడ జరగబోయే పోటీ పద్మావతి, సైదిరెడ్డి మధ్య కాదన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానీకం ఆత్మ గౌరవానికి.. నియంత పాలనకు మధ్య జరగబోయే పోరుగా అభివర్ణించారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేను ప్రగతి భవన్కు రానీయకుండా అడ్డుకున్న సంస్కృతి ఆ పార్టీకి మంచిది కాదన్నారు. నియంత పాలనకు అడ్డుకట్ట వేయాలన్నా.. ఎమ్మెల్యేలకు సరైన గౌరవం దక్కాలన్నా.. హుజుర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించి సీఎం కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు కోమటిరెడ్డి. 3 లక్షల 90 వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల వెంబడి తిరుగుతున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని ధ్వజమెత్తారు. ఇక గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య లొల్లి పెట్టిన ఘనత కేసీఆర్దే నంటూ ఫైరయ్యారు. ఉమ్మడి చెక్ పవర్ పేరుతో వారి మధ్య చిచ్చు రేపుతున్నారని.. వాళ్లది వాళ్లు కొట్టుకునేటట్లుగా సిట్యువేషన్ క్రియేట్ చేశారని ఆరోపించారు.