సైకో శ్రీనివాస్ రెడ్డికి శిక్ష: 90 రోజుల్లో విచారణ, మేజిస్ట్రేట్తో ఆసక్తికర సంభాషణ
హజీపూర్లో ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి హతమార్చిన సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి నల్గొండ ఫాస్ట్ట్రాక్ కోర్టు గురువారం తీర్పు ఇవ్వనుంది. తీర్పు నేపథ్యంలో బాధితుల కుటుంబసభ్యులు భారీగా చేరుకుంటున్నారు. కోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలను కూడా మొహరించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కూడా వచ్చారు. గతేడాది మైనర్ బాలికలకు లిప్ట్ ఇస్తానని చెప్పి.. తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి చేసి.. దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఫోక్సో పాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది.
ముగ్గురు బాలికలపై రేప్, హత్య..
గతేడాది సైకో శ్రీనివాస్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు బాలికల మృతదేహలు వ్యవసాయ బావిలో కనిపించాయి. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. కేసులో జూలై 31వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత అక్టోబర్ 14వ తేదీ నుంచి కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. లైంగికదాడి హత్యకు సంబంధించి 101 మంది సాక్షులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. నిందితుడు సైకో శ్రీను ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫున బలంగా వాదించారు.
ఆసక్తికర సంభాషణ
రెండునెలల నుంచి కోర్టులో వాదనలు జరిగే సమయంలో.. జనవరి 3వ తేదీన నిందితుడుతో మేజిస్ట్రేట్ మాట్లాడారు. కోర్టులో మేజిస్ట్రేట్, శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మొబైల్లో ఆశ్లీల సినిమాలు, ఫొటోలు ఉన్నాయని అడిగితే తనకు స్మార్ట్ ఫోన్ లేదని చెప్పారు. మృతురాలి డ్రెస్సులపై స్పెర్మ్ ఉందని అడిగితే తనను పోలీసులు నిర్బంధించి సిరంజి ద్వారా సేకరించారని చిలకపలుకులు పలికారు.
మగాడినే కాదు
బాలికలను బైక్పై తీసుకెళ్లి లైంగికదాడి చేయడమే గాక బావిలో పూడ్చి పెట్టావని నిలదీస్తే.. తాను నపుంసకుడినని.. అలాంటప్పుడు లైంగికదాడి ఎలా చేస్తానని చెప్పి జడ్జీనే విస్మయానికి గురిచేశాడు. తనకు బైక్ నడపడం కూడా రాదని కలరింగ్ ఇచ్చాడు.
ఉరే సరి
ప్రాసిక్యూషన్ వాదనలు, నిందితుడితో మాట్లాడిన మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించనున్నారు. ఇప్పటికే నిర్భయ దోషులకు ఉరి శిక్ష, దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయాల్సి రాగా.. సమత నిందితులకు కూడా కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. సైకో శ్రీనివాస్కు ఉరి శిక్ష విధించాలని యావత్ జాతి కోరుకుంటుంది.