టిడిపికి షాక్, నళిని రిజైన్: అవసరమైతే కెసిఆర్-బాబు మాట్లాడుతారు: కెటిఆర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా, కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ గండ్ర నళిని బుధవారం నాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడికి పంపిస్తున్నట్లు చెప్పారు.
ముప్పై ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న తనకు ఏమాత్రం గుర్తింపు లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రమాదకరంగా మారిందని, ఆదరణ లేని పార్టీలో ఉండలేకపోతున్నానని చెప్పారు. తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానన్నారు.
తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగులు కీలకం: నాయిని
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణ సర్కారు ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. హైదరాబాదులో జరిగిన టీఎన్జీవో సదస్సులో నాయిని, కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
చంద్రబాబు, కెసిఆర్ చర్చిస్తారు: కెటిఆర్
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకుంటామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతమైందని తెలిపారు. టిఎన్జీవోల సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. త్వరలో ఉద్యోగుల పిఆర్సీ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి ఉద్యోగులు వారధుల వంటి వారన్నారు. హైదరాబాదులో ఉద్యోగుల ఇళ్ల విషయమై ముఖ్యమంత్రి కెసిఆఱ్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.
ఉద్యోగుల విభజన పైన కేంద్రం పూర్తి చర్యలు తీసుకోనందువల్లే ఆలస్యమైందన్నారు. అవసరమైతే చంద్రబాబు, కెసిఆర్లు మాట్లాడి అయినా సమస్య పైన చర్చించి పరిష్కరిస్తారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.