నీరు గారిన ఇంటింటికి నల్లా పథకం..!శివారుల్లో అక్రమ నల్లాలు..!కొరడా ఝుళిపిస్తున్న అదికారులు..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి నల్లా పథకం లక్ష్యాన్ని ఛేదించలేకపోతోంది. కొత్తగా ఇచ్చిన కనెక్షన్ లో నీళ్లు రాక, పాత కనెక్షన్ పని చేయక నగర శివారు జనాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో అక్రమ మార్గాల్లో నీటిని పొందేందుకు శివారు ప్రాంతాల ప్రజలు సమాలోచనలు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అక్రమ నల్లా కనెక్షన్లపై వాటర్బోర్డు విజిలెన్స్ కొరడా ఝుళిపిస్తోంది. డివిజన్ల వారీగా విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దాడులు చేపడుతూ అక్రమ కనెక్షన్దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నీటిడిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అక్రమ నల్లా కనెక్షన్లపై వాటర్బోర్డు ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
చందానగర్లో విజిలెన్స్ దాడులు..! అక్రమ నల్లాల గుర్తింపు..!!
చందానగర్, గంగారాం ప్రాంతాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు అక్రమ నల్లా కనెక్షన్లపై తనిఖీలు చేశారు. చందానగర్ వాటర్పైపులైన్లకు ఎలాంటి అనుమతి లేకుండా 25 ఎంఎం వాటర్ పైపులైన్ కనెక్షన్తో నీటిని తోడుస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గంగారం విలేజ్లో అక్రమ నల్లా కనెక్షన్ను గుర్తించారు. అక్రమనల్లాలు కలిగిన ఇద్దరు యజమానులపై వాటర్బోర్డు విజిలెన్స్ అధికారులు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదుచేశారు.
భారీగా బయటపడుతున్న అక్రమనల్లాలు..! అవాక్కవుతున్న అదికారులు..!!
విజిలెన్స్ అధికారుల దాడుల్లో గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటివరకు 150కి పైగా అక్రమనల్లా కనెక్షన్లు బయటపడ్డాయి. అక్రమ కనెక్షన్ల బాగోతం స్థానిక అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గ్రేటర్లో వాటర్బోర్డు 23 డివిజన్లలో ప్రతిరోజూ 470 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తోంది. ఇందులో 40 శాతం నీరు లెక్కలోకి రాకుండా పోతోంది. ఈ నీటిలో 20శాతం అక్రమ నల్లాలతో పీల్చేస్తున్నారు.
ఇద్దరు యజమానులపై క్రిమినల్ కేసులు..! మేల్కొన్న అదికార యంత్రాంగం..!!
వాటర్బోర్డు రికార్డుల ఆధారంగా అనుమతితో తీసుకున్న ప్రతి కనెక్షన్, ప్రతినెలా ఎంతనీరు వినియోగిస్తున్నారు.. ఎంత మొత్తానికి బిల్లులు వసూలవుతున్నాయనేది అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. అక్రమనల్లా కనెక్షన్లతో ప్రతి నెలా కోట్లలో నష్టాలు మూటగట్టుకుంటోంది. పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలతో యథేచ్ఛగా కొంతమంది అక్రమ నల్లాకనెక్షన్లు తీసుకొంటూ నీళ్లను పీల్చేస్తున్నారు.
ఏళ్ల తరబడి సిబ్బంది ఒకే చోట..! చర్యలకు రంగం సిద్ధం..!!
అక్రమ కనెక్షన్లు తీసుకున్న వారిపై పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్న విజిలెన్స్ యంత్రాంగం, స్థానిక అధికారుల తీరుపై నజర్ పెట్టింది. అక్రమనల్లా కనెక్షన్ల గుర్తింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నివేదిక సిద్ధం చేస్తున్నారు. తదనుగుణంగా సిబ్బందిపై వాటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.