ఎంపీకి చేదు, నిప్పంటించుకున్న ఓదేలు అనుచరుడు: నాపై హత్యాయత్నమని బాల్క సుమన్
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్కు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. నల్లాల ఓదేలుకు టిక్కెట్ ఇవ్వనందుకు ఆయన అభిమాని ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. దీంతో మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఎక్కడ పోటీ చేద్దాం, ఎక్కడ గెలుస్తాం: తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఆరా
బాల్క సుమన్కు ఇటీవల తెరాస పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. దీంతో సుమన్ మంచిర్యాల జిల్లా ఇందారంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు పలువురు తెరాస మహిళా కార్యకర్తలు హారతులు పట్టారు.
ఈ సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఆందోళన నెలకొంది.
ఈ సమయంలో ఓదేలు అనుచరుడు గట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలను ఆర్పే సమయంలో మరికొందరు గాయపడ్డారు. గట్టయను ఆసుపత్రిలో చేర్పించారు.
కాగా, ఇటీవల కేసీఆర్ ప్రకటించిన టిక్కెట్లతో తెరాసలో మంట రాజుకున్న విషయం తెలిసిందే. చెన్నూరు నుంచి ఇటీవలి వరకు నల్లాల ఓదేలు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయనకు టిక్కెట్ తిరస్కరించిన కేసీఆర్.. బాల్క సుమన్కు ఇచ్చారు.
నాపై హత్యాయత్నం: బాల్క సుమన్
చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తన పైన నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. సుమన్ ఆరోపణలను నల్లాల ఓదేలు ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని ఓదేలు మంగళవారం తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకున్నారు. తనకు కేసీఆర్ టిక్కెట్ కేటాయించారని, ఎవరు అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, ఓదేలు వర్గం ఎన్ని కుట్రలు చేసినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇది కేసీఆర్ నిర్ణయమని, ఆయన శిష్యుడిగా ఆ నిర్ణయాన్ని పాటిస్తానని చెప్పారు.