తుమ్మల రిజైన్ చేసి రా!: రంగంలోకి నామా, అందుకే మంత్రిని: కెటిఆర్
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావును బరిలో దించాలని టిఆర్ఎస్ అనుకోవడం ఓ అనూహ్య పరిణామం. టిడిపి పోటీగా నామా నాగేశ్వర రావును దించాలని భావించడం మరో ఆసక్తికర పరిణామం.
ఈ నేపథ్యంలో తుమ్మల పైన నామా నాగేశ్వర రావు పోటీ చేస్తారా అనే చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్న నామా నాగేశ్వర రావు పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే వాదనలు వినిపించాయి.
మళ్లీ తుమ్మలXనామా: 'టిడిపి'ని రాజేసిన రేవంత్ రెడ్డి?
అయితే, అనూహ్యంగా నామా తెరపైకి వచ్చారు. ఆయన గురువారం నాడు కెసిఆర్ పాలన పైన నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తుమ్మల మంత్రి పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీని వాడుకొని వదిలేసిన తుమ్మలను ఓడించి తీరుతామని చెప్పారు. ఇందుకోసం ఇతర పక్షాలన్నింటిని కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు లొంగేది లేదన్నారు.
పాలేరులో తుమ్మల వర్సెస్ నామా: కెటిఆర్కు గెలుపు బాధ్యత
టిఆర్ఎస్కు కెటిఆర్ కొత్త అర్థం
తెలంగాణ రాష్ట్ర సమితికి మంత్రి కెటి రామారావు కొత్త అర్థం చెప్పారు. టిఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి' అన్నారు. కెటిఆర్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. పాలేరు ఉప ఎన్నికలో విపక్షాలన్నీ జట్టు కట్టి బరిలోకి దిగినా, తుమ్మల విజయాన్ని అడ్డుకోలేవన్నారు. కాగా, పాలేరు ఉప ఎన్నికలకు కేటీఆర్ ఇంచార్జిగా ఉన్న విషయం తెలిసిందే.
పాలేరులో తెరాసదే విజయమని కెటిఆర్ అన్నారు. పార్టీ సర్వేలో తుమ్మలను నిలబెట్టాలని ప్రజలు చెప్పారని, అందుకే తుమ్మలను బరిలోకి దించామని కెటిఆర్ చెప్పారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తుమ్మల కీలక పాత్ర పోషించారన్నారు. ముసుగు యుద్ధాలని పాలేరు ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. ఏ ఎన్నిక జరిగినా తెరాసదే విజయమన్నారు.