కాంగ్రెస్కు షాకిచ్చిన లెఫ్ట్, నామా కోసం రేవంత్ రెడ్డి పట్టు
ఖమ్మం: దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నిక జరగనుంది. టిఆర్ఎస్ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బరిలోకి దిగుతున్నారు. టిడిపి తరఫున నామా నాగేశ్వర రావును దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు, సిట్టింగ్ స్థానమైన పాలేరు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. మృతి చెందిన ఎమ్మెల్యే వెంకట రెడ్డి సతీమణి సుచరిత రెడ్డిని బరిలోకి దింపుతోంది.
అధికార టిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవానికి ముందుకు రాకపోవడంతో... కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల నుంచి నరుక్కొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు విపక్ష నేతలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
టిడిపి, సిపిఎం, సిపిఐ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. విపక్షాల తరఫున సుచరితా రెడ్డిని నిలిపేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు.
ఇందులో భాగంగా లెఫ్ట్ పార్టీకి ఫోన్ చేశారు. అయితే, సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ పార్టీకి నో చెప్పారు. తాము సిపిఐతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణతోను మాట్లాడనున్నారు. వైసిపి అధినేత జగన్తోను మాట్లాడేందుకు ఉత్తమ్ సిద్దమవుతున్నారని తెలుస్తోంది.
నామా దిగుతారా?
ఖమ్మం జిల్లా పాలేరు నుంచి టిడిపి తరఫున నామా నాగేశ్వర రావు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామాతో పోటీ చేయించేందుకు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు వద్ద రేవంత్, ఎల్ రమణలు మాట్లాడారని తెలుస్తోంది.