మరోమారు ఆ కేసులో విజయమ్మ , షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 14న హాజరు కావలసిందే
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో పాటు కొండా దంపతులకు ఇటీవల నాంపల్లి కోర్టు సమన్లు జారీ చెయ్యటం, ఆ సమన్లు తమకు అందని కారణంగా వారు నాంపల్లి కోర్టుకు విజయమ్మ , షర్మిల హాజరుకాకపోవటం తెలిసిందే . ఇక ఈ క్రమంలో నాంపల్లి కోర్టు మరోమారు వీరికి సమన్లు జారీ చెయ్యనుంది . స్వయంగా కోర్టు అధికారులే విజయమ్మ, షర్మిలకు సమన్లు అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే 2012లో నాటి వరంగల్ జిల్లా పరకాలలో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభను నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఇటీవల హైదరాబాద్ స్పెషల్ కోర్టు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితోపాటు ఆమె కుమార్తె షర్మిలకు, కొండా మురళి, సురేఖ దంపతులకు సమన్లను జారీ చేసింది. వారు జనవరి 10వ తేదీన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే నిందితులు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నాంపల్లి కోర్టుకు సమన్లు అందని కారణంగా హాజరు కాలేదు .
కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల పీఎస్లో నమోదైన కేసుకు సంబంధించి వారు జనవరి 10న కోర్టుకు వెళ్ళారు . ఉప ఎన్నికల్లో అనుమతి లేకుండా సభ నిర్వహించడంపై కోర్టులో కేసు నడుస్తోంది. నాంపల్లి కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. కోర్టు విజయమ్మ, షర్మిలకు సమన్లు అందించనున్న నేపధ్యంలో ఇక విజయమ్మ , షర్మిల ఫిబ్రవరి 14న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.