శ్యామ్ కె నాయుడు చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు..
సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ తెర పైకి వచ్చింది. సినీ ఆర్టిస్ట్ సాయి సుధ పెట్టిన కేసుతో రిమాండ్కు వెళ్లిన శ్యామ్ కె నాయుడుకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ మంజూరు కోసం శ్యామ్ కోర్టుకు సమర్పించిన పత్రాలు నకిలీవని సాయి సుధ కోర్టుకు తెలిపారు. దీంతో తాజాగా నాంపల్లి కోర్టు శ్యామ్ కె నాయుడు బెయిల్ రద్దు చేసింది.
సాయి సుధ,తానూ ఇద్దరం రాజీకొచ్చామని పేర్కొంటూ శ్యామ్ కె నాయుడు నాంపల్లి న్యాయస్థానంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఫోర్జరీ సంతకంతో ఈ పిటిషన్ వేసినట్టు విచారణలో వెల్లడైంది.
కాగా,దాదాపు నెల క్రితం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శ్యామ్తో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని.. 2015 నుంచి తాము సహజీవనం చేస్తున్నామని... మొదట్లోనే తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని సుధ ఆరోపించింది.
అంతేకాదు,తమ సహజీవనం గురించి శ్యామ్ అన్నయ్య చోటా కె నాయుడుకు కూడా తెలుసునని,తమకు పెళ్లి చేయిస్తానని ఆయన మాటిచ్చారని పేర్కొంది. కానీ ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులు ఆగమన్నారని చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారని... దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారని ఆరోపించింది.
శ్యామ్తో తన సహజీవనానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. సుధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్కేనాయుడుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. అయితే రిమాండ్కు వెళ్లిన రెండు రోజుల్లోనే అతడు బెయిల్పై బయటకు వచ్చాడు.