చేయి చేసుకున్న ఎమ్మార్వో: భోరున విలపించిన యువతి, బంధువుల ఆందోళన
నల్గొండ: ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా ఉండాల్సిన ఓ ప్రభుత్వ అధికారిణి.. అసహనానికి గురై ఓ వయుతిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆ యువతి భోరున విలపించింది. కుటుంబసభ్యులు, బంధువులకు చెప్పడంతో వారు సదరు అధికారిణి ముందు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టంపహాడ్కు చెందిన ఉగ్గపల్లి సరిత అనే యువతి ఆదాయ, కులధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు. ధృవీకరణ పత్రాల కోసం మీసేవా రశీదులతో కార్యాలయంలోని కంప్యూటర్ కౌంటర్ వద్ద నిరీక్షించారు.
ఈ సమయంలో ఛాంబర్ నుంచి బయటికి వచ్చిన తహసీల్దార్(ఎమ్మార్వో) కేసీ ప్రమీల.. ఇక్కడ నీకేంపని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఎమ్మార్వో ప్రమీల తనపై చేయి చేసుకున్నారని సరిత విలపిస్తూ తెలిపారు.
కాగా, విషయం తెలిసిన సరిత కుటుంబసభ్యులు, బంధువులు కార్యాలయానికి చేరుకుని ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ కార్యాలయానికి వస్తే ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఆమెను నిలదీశారు. అయితే, తాను మాత్రం ఎవరిపైనా చేయి చేసుకోలేదని, కంప్యూటర్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతోనే పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టానని ఎమ్మార్వో ప్రమీల చెప్పారు.