జూపల్లిని కలిసిన మహేశ్ సతీమణి నమ్రత: సిద్ధాపూర్ అభివృద్ధిపై చర్చ
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోమవారం తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. మహేశ్ బాబు దత్తత తీసుకున్న మహబూబ్నగర్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులపై మంత్రితో ఆమె చర్చించారు.
సిద్ధాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అడిగినట్లు సమావేశం అనంతరం నమ్రతా శిరోద్కరు తెలిపారు. సిద్ధాపూర్ గ్రామాన్ని మోడ్రన్ స్మార్ట్ విలేజ్గా చేస్తామని చెప్పారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నమ్రతా అడిగిన మేరకు ప్రభుత్వం నుంచి సహకారం అందజేస్తామని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అందరూ సహకరించాలని అన్నారు.
కాగా, నమ్రతా శిరోద్కర్ ఇటీవల తాము దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించిన విషయం తెలిసిదే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. త్వరలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మహేష్ బాబులు గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కలెక్టర్ ఇతర అధికారులతో అభివృద్ధి పనుల విషయమై చర్చిస్తున్నామని చెప్పారు. రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారం కావని, ఒక్కటొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
తాము దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామాన్ని మోడర్న్ గ్రామంగా, స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. దత్తత కాన్సెప్టుతో తెరకెక్కిన మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.
ఏపీలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా, ఇటీవల గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో గల్లా జయదేవ్ భార్యతో కలిసి పర్యటించి గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్నారు. మహేశ్ బాబు కూడా బావ జయదేవ్తో కలిసి బుర్రిపాలెంలో పర్యటించారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.