మహిళను, కుమారుడిని రక్షించారు: శిథిలాల కింద వీరే...
నానక్రామ్ గుడా భవనం కూల్చివేత ఘటనలో సహాయ బృందాలు ఓ మహిళను, ఆమె కుమారుడిని రక్షించారు. శథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాదులోని నగరంలోని నానక్రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయ బృందాలు శిథిలాల కిందన ఉన్న ఓ మహిళను, ఆమె కుమారుడిని రక్షించాయి. ఆమె రేఖగా, ఆమె కుమారుడిని రోహణ్గా గుర్తించారు. రేఖ భర్త శివ శిథిలాల కింద మరణించాడు. వారు ఛత్తీస్గడ్కు చెందినవారని సమాచారం. శివతోపాటు మరో నలుగురి మృతదేహాలను కూడా బయటికి తీశారు.
కూలీలు నిద్రిస్తుండగా: నానక్రాంగూడలో కూలిన ఏడంతస్తుల బిల్డింగ్, ఇవే కారణమా?
కాగా, శిథిలాల కింది నుంచి శుక్రవారం ఉదయానికి కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. పోలినాయుడు, నారాయణ, వెంకటలక్ష్మి, సాంబయ్య, పైడమ్మ, గౌరి, పోలి నాయుడు, నారాయణ, శంకరరావు, దుర్గారావు వెంకటలక్ష్మి శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్నారు. వారంతా విజయవాడలోని బొబ్బిలి ప్రాంతానికి చెందినవారు.
గాయపడిన వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కిందకు పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించేందుకు పది అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్ నానక్రామగూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి కుప్పకూలిన విషయం తెలిసిందే.
భవనం యజమాని సత్తుసింగ్ అలియాస్ సత్యనారాయణ సింగ్ అందుబాటులో లేడని తెలుస్తోంది. అతనిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. భవనానికి సరైన అనుమతులు లేవని తేలిందని మేయర్ రామ్మోహన్ చెప్పారు.