హైటెక్ సిటీని కూల్చేయ్, ఆ బిల్డింగుల్లో మీటింగ్ పెట్టి: కేసీఆర్పై ఊగిపోయిన బాలకృష్ణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆదివారం హైదరాబాదులో ప్రచారం నిర్వహించారు. సామాజిక న్యాయం కోసం పోరాడింది టీడీపీయే అన్నారు. పార్టీ జెండా తెలంగాణ నిండా ఎగరాలని చెప్పారు.
తెలంగాణలో టీడీపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని, ప్రజా కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా కుటుంబపాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. సమాజంలో అసమానత రూపు మాపేందుకు కృషి చేసింది, తెలుగుజాతి గౌరవాన్ని, ఉనికిని కాపాడింది.. టీడీపీయే అన్నారు. తెలుగువారిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిందన్నారు.
చంద్రబాబు కట్టించిన బల్డింగుల్లో మీటింగ్ పెట్టి ఆయన్నే విమర్శిస్తావా?
గడీల పాలనను అంతం చేసింది కూడా తెలుగుదేశం పార్టీయేనని బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పెద్దఎత్తున జరగాలంటే ప్రజా కూటమిని గెలిపించాలన్నారు. చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్లు పెట్టుకుంటూ చంద్రబాబునే విమర్శిస్తారా అని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. హైదరాబాద్కు దీటుగా సైబరాబాద్ను చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. టీడీపీలో గెలిచి తెరాసకు వలసపోయిన నమ్మకద్రోహుల భరతం పట్టాలన్నారు. బీజేపీకి గుణపాఠం చెప్పందుకే ప్రజాకూటమి ఏర్పాటు చేశామన్నారు. ప్రజా కూటమి అభ్యర్థి భవ్య ఆనంద్ప్రసాద్ను గెలిపించాలన్నారు.
హైటెక్ సిటీ కూల్చెయ్, శంషాబాద్ విమానాశ్రయం మూసెయ్
హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర ఉందని బాలకృష్ణ చెప్పారు. కేసీఆర్ ఎన్నో కబుర్లు చెబుతున్నారని, చంద్రబాబు పేరు వినిపించవద్దనుకుంటే శంషాబాద్ విమానాశ్రయాన్ని మూసేయగలరా, హైటెక్ సిటీని కూల్చేయగలరా, ఫ్లై ఓవర్ను తొలగించగలరా అని, మీకు అంత దమ్ముందా అని కేసీఆర్ను ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఉపాధి, ఉద్యోగావకాశాలు లేవని, అమరవీరుల బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. అలాంటి అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
మాహిష్మతిని పాలించేది భల్లాలదేవుడే అయినా గుర్తుండేది బాహుబలి
బాలకృష్ణ శనివారం సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేది భల్లాలదేవుడే అయినా ప్రజలు గుర్తు పెట్టుకునేది మాత్రం బాహుబలినే అన్నారు. చంద్రబాబును దూషించే వారివి గల్లీ బుద్ధులన్నారు. టీడీపీ నాయకుల కోసం కాదని, ధనవంతుల కోసం కాదన్నారు. పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అన్నారు.
వెన్నుపోటు పొడిచిన వారికి బుద్ధి చెప్పాలి
టీడీపీ పథకాలనే ఇప్పటి పార్టీలు కాపీ కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని బాలకృష్ణ చెప్పారు. ఎన్ని సుడిగుండాలు ఎదురైనా టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందని చెప్పారు. రాజకీయ జీవితాన్ని, గుర్తింపును ఇస్తే టీడీపీకి వెన్నుపోటు పొడిచి పదవుల కోసం వేరొక పార్టీని ఆశ్రయించిన వారికి(తలసాని శ్రీనివాస్ యాదవ్) సనత్నగర్ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
హైటెక్ సిటీని మూసేస్తారా
హైదరాబాద్లో సాఫ్టువేర్ రంగం ఘనత చంద్రబాబుదేనని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబును హైదరాబాద్ చరిత్ర పుటల నుంచి తొలగించాలంటే హైటెక్ సిటీని, ఔటర్ రింగ్ రోడ్డును మాయం చేయాలని అలా చేసే దమ్ముందా అన్నారు. ఢిల్లీ గల్లీలో కాళ్లు పట్టుకునే చరిత్ర చంద్రబాబుది కాదని, అభివృద్ధి కోసం ప్రపంచం చుట్టి వచ్చే మనిషి అన్నారు.