హరికృష్ణ కారు ప్రమాదం: పట్టించుకోవడం లేదంటూ బాధిత యువకుల ఆవేదన
హైదరాబాద్/నల్గొండ: టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం నార్కట్పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. హరికృష్ణ మరణంతో ఆయన కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నెలకొంది.
హరికృష్ణ కారు ఢీకొనడంతో గాయాలపాలైన యువకులు
ఇది ఇలా ఉండగా, హరికృష్ణ నడిపిన కారు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో మరో కారు లోని యువకులు కూడా గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, శివ, భార్గవ్, ప్రవీణ్లు ఉన్నారు. వీరికి సంబంధించిన కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామాగ్రితోపాటు కారు కూడా ధ్వంసమైంది.
Recommended Video
ఆస్పత్రిలో చేర్పించారు కానీ..
ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వీరిని కూడా అదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే, హరికృష్ణ భౌతికకాయాన్ని తరలించిన తర్వాత తమను ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి కొంటే..
ఓ ప్రొగ్రాం నిమిత్తం చెన్నైకి వెళ్లి వస్తుండగా అనుకోని విధంగా హరికృష్ణ కారు రూపంలో ప్రమాదం ఎదురైందని ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్న ఆ యువకులు వాపోయారు. తామంతా మధ్యతరగతి వాళ్లమని, అప్పులు తెచ్చి మరీ కెమెరాలు కొనుగోలు చేశామని, అవి ఇప్పుడు పనిచేయకుండా మారాయని తెలిపారు. గాయాలపాలైన తమకు న్యాయం చేయాలని సదరు యువకులు కోరుతున్నారు.
ఆదుకోండంటూ వేడుకోలు..
కాగా, హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.