హరికృష్ణ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ భవన్ ఎందుకు తీసుకు వెళ్లలేదంటే?
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మృతదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించాలని తొలుత భావించారు. కానీ స్మశాన వాటికకు వెళ్లేముందు భౌతికకాయానికి స్నానం చేయించాల్సి ఉంది. టీడీపీ కార్యాలయానికి తీసుకు వెళ్తే మళ్లీ స్నానం కోసం ఇంటికి తీసుకు రావాల్సి ఉంటుంది.
ఇదంతా ఇబ్బందితో కూడిన వ్యవహారమని భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తీసుకు వెళ్లలేదు. హరికృష్ణను బుధవారం తొలుత మెహిదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తీసుకు వెళ్లాలని భావించారు. కానీ ఆ తర్వాత అక్కడే ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఇదిలా ఉండగా, హరికృష్ణ అంతిమయాత్ర ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి చేరుకుంది. హరికృష్ణ అంతిమ సంస్కారాలకు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. హరికృష్ణ పార్థివదేహంపై టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో చాలామంది పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.